సున్నా వడ్డీ సొమ్ము నేరుగా రైతులకే

9 Jul, 2020 03:04 IST|Sakshi
బుధవారం వైఎస్సార్‌ జిల్లా ట్రిపుల్‌ ఐటీలో దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం నాగలి, చెర్నాకోలతో సీఎం వైఎస్‌ జగన్‌

ఏటా సీజన్‌ ముగిసే నాటికి వారి ఖాతాల్లో నగదు జమ

గత ప్రభుత్వ బకాయి రూ.1,150 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్‌ 

57 లక్షల రైతులకు ప్రయోజనం కల్పించిన ప్రభుత్వం

రైతులు సకాలంలో రుణాలు చెల్లిస్తే, వడ్డీ బాధ్యత ప్రభుత్వానిదే

రైతు దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలకు శ్రీకారం

ఆర్‌బీకేలలో రూ.1,572 కోట్లతో అధునాతన యంత్రాల కొనుగోలు 

శ్యాచురేషన్‌ పద్ధతిలో పశువులకు కృత్రిమ గర్భధారణ కార్యక్రమం

సహకార సుగర్‌ ఫ్యాక్టరీల బకాయిలు రూ.54 కోట్లు చెల్లింపు

ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాల నిర్మాణానికి రూ.1,000 కోట్ల నాబార్డు రుణం

కేంద్రం, నాబార్డుతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం

రైతుల బాగు కోసం 13 నెలలుగా అనేక కార్యక్రమాలు, పథకాలు

రైతుల పట్ల మంచి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే.. నాన్న గారి పేరు గొప్పగా కనిపిస్తుంది. ఆయన రైతుల గురించి ఆలోచించి, చేయాల్సింది చేసి వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అందుకే ఆయనకు ఆ గౌరవ మర్యాదలు ఇస్తున్నారు. 

ప్రభుత్వ చర్యల కారణంగా ఈ ఏడాది ఏకంగా 180.54 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. జలయజ్ఞంలో భాగంగా ప్రాజెక్టుల పనులను పరుగెత్తిస్తున్నాం. ఈ ఏడాది 6 ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి పనులు చేయాలని ఆకాంక్షిస్తున్నా. 

సున్నా వడ్డీ పథకానికి గత ప్రభుత్వం గ్రహణం పట్టించింది. రైతులను మోసం చేసింది. దాదాపు 57 లక్షల మంది రైతులకు రూ.1,150 కోట్లు బకాయి పెట్టింది. ఇప్పుడు ఆ మొత్తాన్ని మన ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. రైతులు సకాలంలో రుణాలు చెల్లిస్తే.. ఖరీఫ్, రబీ.. ఏ సీజన్‌కు ఆ సీజన్‌ పూర్తయ్యే నాటికి వారి వడ్డీ కట్టే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. వడ్డీ మొత్తాన్ని బ్యాంకులకు కాకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తుంది. 
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు ఇక నుంచి నేరుగా సున్నా వడ్డీ ప్రయోజనాన్ని కల్పిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఖరీఫ్‌కు సంబంధించిన రుణాలను సకాలంలో చెల్లిస్తే అక్టోబర్‌లో.. రబీకి చెందిన రుణాలను సకాలంలో చెల్లిస్తే మార్చిలో సున్నా వడ్డీ రాయితీ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకుని రైతు దినోత్సవం సందర్భంగా బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన సున్నా వడ్డీ సొమ్ము రూ.1,150 కోట్లను 57 లక్షల మంది రైతుల ఖాతాలకు కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి జమ చేశారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ జిల్లాల్లోని రైతులనుద్ధేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

వైఎస్సార్‌.. వ్యవసాయం
► రాష్ట్రంలో 62 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడ్డారు. 2004లో వైఎస్సార్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు రూ.1,200 కోట్ల విద్యుత్‌ బిల్లులు రద్దు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చే ఫైలు మీద తొలి సంతకం చేశారు. అందువల్ల సగటున రైతులు వినియోగించే విద్యుత్‌ రూపేణా ఏటా ఒక్కొక్కరికి రూ.50 వేల ప్రయోజనం కలుగుతోంది.

► 2004 ఎన్నికల ముందు రైతులకు ఉచిత విద్యుత్‌ అంటే చంద్రబాబు చులకన చేశారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తే, బట్టలు ఆరేసుకోవడానికి తప్ప విద్యుత్‌ తీగలు పనికి రావన్నారు. అది సరికాదని వైఎస్సార్‌ అమలు చేసి చూపారు. 

►  వైఎస్సార్‌ అంటే ఒక్క ఉచిత విద్యుత్‌ మాత్రమే కాదు.. ఆరోగ్యశ్రీ, 108, 104 సర్వీసులు, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం అన్నీ గుర్తుకు వస్తాయి. వైఎస్సార్‌ తరహాలోనే మా ప్రభుత్వం కూడా రైతుల కోసం చాలా పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోంది. 

వెంటనే ఆందోళన పడొద్దు
► ఇప్పుడు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న రూ.1,150 కోట్లు గత ప్రభుత్వం బకాయి పెట్టిన వడ్డీ సొమ్ము. ఇది అంతకు ముందు ఏడాదికి చెందిన రుణాలకు సంబంధించినవి కాబట్టి, ఇవాళ బటన్‌ నొక్కిన వెంటనే అందరు రైతుల ఖాతాల్లో జమ కాకపోతే కంగారు పడొద్దు. 

► నాలుగు రోజులు బ్యాంకులకు సమయం ఇవ్వాలి. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే కాల్‌ సెంటర్‌ నంబరు 1907కు ఫోన్‌ చేయాలి.

ఫామ్‌ మెకనైజేషన్‌
► రైతులకు సాగులో ఉపయోగపడే యంత్రాలు నేరుగా రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) పరి«ధిలోకి తీసుకువస్తున్నాం. 

► అవి అవసరమైన రైతులు ఆర్‌బీకేలను సంప్రదిస్తే, తక్కువ వ్యయానికే పొందవచ్చు. దాదాపు రూ.1,572 కోట్ల వ్యయంతో యంత్రాలు సేకరిస్తున్నాం.

► పశు సంవర్థక శాఖ రైతు భరోసా కేంద్రాల ద్వారా శ్యాచురేషన్‌ పద్ధతిలో పశువులకు కృత్రిమ గర్భధారణ చేస్తుంది. పూర్తి స్థాయిలో వైద్య సేవలందిస్తుంది. 

చెరకు రైతుల బకాయిల చెల్లింపు
► సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీల పరిధిలో రైతులకు గత ప్రభుత్వం దాదాపు రూ.88 కోట్లు బకాయి పెట్టింది. ఇటీవల ఇందులో రూ.34 కోట్లు ఇచ్చాం. ఇవాళ మరో రూ.54 కోట్లు ఇస్తున్నాం. 

► తద్వారా 5 ఫ్యాక్టరీల పరిధిలో 36 వేల మంది చెరకు రైతులకు లబ్ధి కలుగుతుంది.

శిలాఫలకాల ఆవిష్కరణ
► వ్యవసాయ యాంత్రీకరణ చర్యలలో భాగంగా కర్నూలు జిల్లా తంగడంచ, తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట, శ్రీకాకుళం జిల్లా నైరాలో యంత్ర శిక్షణ కేంద్రాల పనులకు సంబంధించి సీఎం జగన్‌ ఆన్‌లైన్‌లో శిలా ఫలకాలు ఆవిష్కరించారు. రూ.42 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ శిక్షణ కేంద్రాలలో ఏటా సుమారు 1,500 మందికి శిక్షణ ఇస్తారు.

► వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద రుణాలు, వైఎస్సార్‌ రైతు భరోసా, కౌలు రైతులకు మేలు చేసే విధంగా తీసుకువచ్చిన పంటసాగుదారు హక్కు పత్రం, వరిలో సరైన మోతాదుల్లో ఎరువుల వాడకం, సమగ్ర ఎరువుల యాజమాన్యం, రైతులకు ఉద్దేశించిన 155251 టోల్‌ ఫ్రీ నంబర్‌కు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.

► ఆర్బీకేల ద్వారా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల సమాచారం ఎప్పటికప్పుడు రైతులకు తెలిపే ఉద్దేశంతో వ్యవసాయ శాఖ రూపొందించిన ‘డాక్టర్‌ వైఎస్సార్‌ రైతు భరోసా’ మాసపత్రికను సీఎం ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్‌ మత్స్య శాఖ రూపొందించిన మత్స్య సాగుబడి మార్గదర్శి పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. 

► రైతు దినోత్సవం కార్యక్రమంలో మంత్రులు కె.కన్నబాబు, మోపిదేవి, సీఎస్‌ నీలం సాహ్ని,  పలు శాఖల ఉన్నతాధికారులు, ఢిల్లీ నుంచి మత్స్య శాఖ కార్యదర్శి రాజీవ్‌ రంజన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. 

గత 13 నెలల్లో రైతుల కోసం ఎన్నో చేశాం
► వైఎస్సార్‌ రైతు భరోసా కింద దాదాపు రూ.10,242 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ. ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం. 10,641 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు. రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేలా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి.

► కనీస ధర ప్రకటించని వ్యవసాయ ఉత్పత్తులు, త్వరగా చెడిపోయే అరటి, టమాటా, బొప్పాయితో పాటు పొగాకు కూడా ఇవాళ రైతుల నుంచి కొంటున్నాం.

► రూ.8,655 కోట్ల వ్యవసాయ విద్యుత్‌ బకాయిలు ఇచ్చాం. వడ్డీ లేని రుణాలకు గానూ రూ.1,150 కోట్లు చెల్లిస్తున్నాం. ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు ఇచ్చాం. రూ.384 కోట్లు విత్తనాల బకాయిలు కూడా చెల్లించాం.

► 2018–19 రబీ పంటల బీమా ప్రీమియమ్‌ రూ.122.16 కోట్లు కట్టాం. బీమా కంపెనీలతో మాట్లాడి రైతులకు రూ.596 కోట్ల పరిహారం అందించాం. 

► రైతులకు పగలే నాణ్యమైన విద్యుత్‌ 83 శాతం ఫీడర్లలో ఇస్తున్నాం. రబీ నాటికి మిగిలిన ఫీడర్ల కింద కూడా ఇచ్చేందుకు రూ.1,700 కోట్లు ఖర్చు చేస్తున్నాం.

► దేశ చరిత్రలోనే తొలిసారిగా పంటల బీమా సొమ్ములో రైతు ల వాటాగా రూ.690 కోట్లు, ప్రభుత్వ వాటాగా రూ.766 కోట్లు.. మొత్తం రూ.1,456 కోట్లు కట్టాం.

► ఆక్వా రైతులకు కరెంటు యూనిట్‌ రూ.1.50కే ఇస్తూ దాదాపు రూ.700 కోట్లు సబ్సిడీ.

► రూ.2753 కోట్లతో కరోనా సమయంలో 8.25 లక్షల మెట్రిక్‌ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశాం. శనగ రైతులకు రూ.300 కోట్లు ఇచ్చి ఆదుకున్నాం. మార్కెట్‌ యార్డులను 191 నుంచి 216కు పెంచాం. వ్యవసాయ ట్రాక్టర్లకు రహదారి పన్ను రద్దు చేశాం.

► ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు  వైఎస్సార్‌ బీమా ద్వారా రూ.7 లక్షల సహాయం అందిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో 417 కుటుంబాలకు అండగా ఉంటూ రూ.20.85 కోట్లు ఇచ్చాం. వ్యవసాయ మిషన్‌ ఏర్పాటు చేశాం.

► కౌలు రైతులు, ఆలయ భూములు, పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు కూడా రైతు భరోసా పథకం అమలు చేశాం.  155251 టోల్‌ ఫ్రీ నంబర్‌తో ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం.   

ఫిషింగ్‌ హార్బర్లు, ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాలు.. ఎంఓయూ
► మత్స్యకారులు ఉపాధి వెతుక్కుంటూ వలస పోతున్నారు. ఆ పరిస్థితిని మార్చడం కోసం దాదాపు రూ.2,800 కోట్ల వ్యయంతో 8 ఫిషింగ్‌ హార్బర్లు, 4 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. 

► ఇటీవలే జువ్వలదిన్నె ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రానికి సంబంధించి కేంద్రం, నాబార్డుతో ఒప్పందం చేసుకున్నాం.  నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాలకు ఇవాళ కేంద్రం, నాబార్డుతో రూ.1,000 కోట్లతో ఒప్పందం చేసుకుంటున్నాం. 8 ఫిఫింగ్‌ హార్బర్లలో 4 ఫిషింగ్‌ హార్బర్ల పనులు రూ.1,300 కోట్లతో మొదలు పెడుతున్నాం.

మిమ్మల్ని ఎన్నుకున్నందుకు గర్వంగా వుంది 
గత ప్రభుత్వంలో రుణమాఫీ పేరుతో మోసపోయాం. ఈ రోజు రైతు భరోసాతో మమ్మల్ని ఆదుకుంటున్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇక అటువంటి పాలన మళ్లీ చూడలేమనుకున్నాం. కానీ మీరు  వచ్చాక మా కష్టాలను మరిచిపోయేలా చేశారు. గతంలో ఒక ప్యాకెట్‌ విత్తనాల కోసం ఎన్నో పాట్లు పడాల్సి వచ్చేది. నేడు రైతు భరోసా కేంద్రాల ద్వారా బుక్‌ చేసుకున్న 48 గంటల్లో నేరుగా మా గ్రామానికే వస్తున్నాయి. పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది. సున్నా వడ్డీ రుణాలిస్తోంది. ఆర్‌బీకేలు రైతులకు ఆయువు పట్టుగా ఉన్నాయి. రైతులందరూ హాయిగా ఉన్నారు. మీలాంటి సీఎంను ఎన్నుకున్నందుకు మేం గర్వంగా ఫీలవుతున్నాం.  
– సీఎంతో సీహెచ్‌ మాధవరావు, కాసాపేట గ్రామం, విజయనగరం జిల్లా

మీ మేలును రైతాంగం మరవదు
ఈ రోజు రాష్ట్రానికి ఒక శుభదినం. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారి జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం రాష్ట్రంలోని రైతుల్లో సంతోషాన్ని నింపుతోంది. ఆనాడు సీఎంగా వైఎస్సార్‌ ప్రజలకు ఎంతో మేలు చేశారు. ఆయన రైతన్నను రారాజుగా చూడాలని అనుకుంటే.. మీరు రైతును మహా రాజులా నిలబెట్టారు. కరువు కాటకాలతో ప్రజలు అల్లాడుతుంటే జలయజ్ఞం చేపట్టారు. ప్రాజెక్టులు నిర్మించి పంటలకు సాగు నీటిని అందించారు. ఆయన మరణం తర్వాత చీకటి రాజ్యం వచ్చిందని బాధపడుతున్న రైతులకు మీ పాలనతో రామరాజ్యం వచ్చింది. పండించిన పంటను ఎవరికి అమ్ముకోవాలో తెలియని దిక్కుతోచని స్థితిలో వున్న రైతులకు కొనుగోలు కేంద్రాల ద్వారా ఊరట కలిగించారు. మీ మేలును రైతాంగం మరచిపోదు. 
–అంకె రామలింగయ్య, రైతు, కందుకూరు, అనంతపురం

మరిన్ని వార్తలు