ఆర్భాటాలొద్దు పనులు చేయండి

26 Nov, 2019 03:20 IST|Sakshi
సీఆర్‌డీఏ సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ప్రాధాన్యతను బట్టి పనులు చేపట్టాలి 

సీఆర్‌డీఏ సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ 

పూర్తి కావస్తున్న పనులపై దృష్టి పెడితే నిధులిస్తాం 

నిర్మాణ పనుల్లో రివర్స్‌ టెండరింగ్‌తో డబ్బు ఆదా   

భూములిచ్చిన రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి అప్పగింత  

సాక్షి, అమరావతి : సీఆర్‌డీఏ పరిధిలో ప్రభుత్వ నిర్మాణాల సముదాయం, భవనాల నిర్మాణంలో అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో వాస్తవాలకు తగినట్లు ప్రాధాన్యతా క్రమంలో వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని చెప్పారు. సీఆర్‌డీఏ పరిధిలో ఇప్పటి వరకు జరిగిన పనులు, చేసిన ఖర్చులు, వివిధ నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయనే అంశాలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో  సమగ్రంగా సమీక్షించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, అనవసర ఖర్చులకు పోకుండా నిర్మాణాల విషయంలో ముందుకు వెళ్లాలని సూచించారు. పూర్తికావస్తున్న పనులపై తొలుత దృష్టి పెట్టాలని, ఇందుకు అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నిర్మాణ పనులకు సంబంధించి రివర్స్‌ టెండరింగ్‌కు వెళితే ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుందన్నారు. 

రోడ్ల డిజైన్‌కు ఐఐటీల సలహా
సీఆర్‌డీఏ పరిధిలో రోడ్ల డిజైన్లపై అధికారులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం.. ప్లానింగ్‌లో ఎక్కడా తప్పుల్లేకుండా చూడాలని ఆదేశించారు. రహదారుల ప్రతిపాదనల విషయంలో ఖర్చు, డిజైన్ల వంటి అంశాలపై ఐఐటీ వంటి ప్రముఖ సంస్థల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. కృష్ణా నది సమీపంలో కొండవీటి వాగు, పాలవాగు వరద ప్రవాహ పరిస్థితిపై అధికారులతో చర్చించారు. వైకుంఠపురం రిజర్వాయర్‌ నిర్మాణం, నీటి వినియోగం వంటి అంశాలపై ఆరా తీశారు. రాజధానిలో రోడ్ల నిర్మాణానికి పోగా మిగిలిన భూమిని సుందరీకరించాలని సూచించారు.

మౌలిక సదుపాయాల కల్పనలో అనవసర వ్యయం తగ్గించి, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాజధానిలో భూములిచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్లను అభివృద్ధి చేసి వారికి అప్పగించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, సీఆర్‌డీఏ కమిషనర్‌ లక్ష్మీ నరసింహం ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు