వరద బాధితులను ఆదుకున్న మంత్రులు

13 Aug, 2019 09:46 IST|Sakshi
వరద బాధిత ప్రాంతాలకు బోటులో వెళ్తున్న మంత్రులు, అధికారులు

సాక్షి, పశ్చిమగోదావరి : అసలే గోదావరి నది.. ఆపై జూలై, ఆగస్టు నెలలు వచ్చాయంటే వరద గోదావరిగా మారుతుంది. ఈ ఏడాది అదే జరిగింది. వరద గోదావరి నదీ పరీవాహ ప్రాంతాలను ముంచెత్తింది. అయితే ఎప్పటిలానే వరదను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నాయకులు కదిలారు. కానీ గతంలో చేసిన ఏర్పాట్లకంటే భిన్నంగా... ఎన్నడూ చేయని విధంగా ప్రభుత్వం కదిలింది. వరద బాధితులను ఆదుకుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు బాధితులకు మేమున్నామంటూ అండగా నిలబడ్డారు. జూలై 30వ తేదీ అర్ధరాత్రి గోదావరి ఉగ్రరూపం దాల్చనుందని జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది. 31వ తేదీ ఉదయమే జిల్లా అధికారులు స్పందించారు. వరదను ఎప్పటికప్పుడు అంచాన వేస్తూ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వరద హెచ్చరికలు వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు ఈ విపత్తు ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా ప్రతి గ్రామానికి ప్రత్యేకాధికారులను నియమించారు. ప్రత్యేకాధికారులు వరద వచ్చే ప్రాంతాలకు చేరుకుని ప్రజలను అప్రమత్తం చేశారు. 

స్పందించిన నాయకులు
మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన రోజే వర్షంలోనే  ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, ఇన్‌చార్జి మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, స్థానిక శాసన సభ్యులు తెల్లం బాలరాజులతో కలిసి కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓ ముంపు ప్రాంతాలకు గోదావరిలో పడవలపై ప్రయాణించారు. ముంపునకు గురయిన కుటుంబాలను అధైర్యపడొద్దు అంటూ, అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. అప్పటికప్పుడే బియ్యం, కిరోసిన్, పంచదార, కందిపప్పు అందచేశారు. వారికి కావాల్సిన మందులు, జనరేటర్లు, టార్ఫాలిన్‌లు సిద్ధం చేశారు. వశిష్టగోదావరి వరదకు ఆచంటలోని లంకగ్రామాలు ముంపునకు గురై తే  గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు రోజూ లంక గ్రామాలకు వెళ్లా రు. ప్రభుత్వం ఇస్తున్న సాయానికి అదనంగా  సొంత డబ్బుతో కుటుంబానికి 10 కిలోల బి య్యం చొప్పున 180క్వింటాళ్లు పంపిణీ చేశారు. 

ముఖ్యమంత్రి తక్షణ స్పందన
గోదావరి వరదపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తక్షణం స్పందించారు.  ఢిల్లీ పర్యటన నుంచి నేరుగా పోలవరం చేరుకుని ఏరియల్‌ సర్వే చేశారు. రాజమండ్రి విమానాశ్రయంలో సమీక్ష నిర్వహించి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి బాధిత కుటుంబానికి రూ.5వేలు పరిహారం ప్రకటించారు. తక్షణం బాధితులకు సహాయం అందించాలని ఆదేశించారు. 

అధికారులు అక్కడే 
కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు ముంపు గ్రామాల్లో పర్యటించారు. జేసీ వేణుగోపాల్‌రెడ్డి నిత్యం పర్యవేక్షించారు. ఐటీడీఏ పీఓ ఆర్‌వీ సూర్యనారాయణ రోజూ ఏర్పాట్లు పరిశీలించారు. ఆర్డీఓ శివ నారాయణరెడ్డి ఏర్పాట్లు చేశారు. డెల్టాలో నరసాపురం ఆర్డీఓ సలీంఖాన్‌ ముంపు గ్రామాల్లో పరిస్థితులు చక్కబెట్టారు. కలెక్టర్, జేసీ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు, ప్రత్యేకాధికారులు, వైద్యాధికారులు, వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు వరదను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండి నిరంతరం పర్యవేక్షించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశారు. 

సహాయం మరువలేనంత 
బాధితులకు ప్రభుత్వం రూ.5వేల సహాయంతో పాటుగా తక్షణమే కిరోసిన్, బియ్యం, టార్పాలిన్‌లు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పామాయిల్, ఉప్పు, మంచినీటి ప్యాకెట్లు అందించింది. ప్రత్యేక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది.  

మరిన్ని వార్తలు