కరోనా టెస్ట్‌ కిట్ల తయారీలో స్వయం సమృద్ధి

9 Apr, 2020 03:35 IST|Sakshi
మెడ్‌టెక్‌ జోన్‌లో తయారు చేసిన టెస్ట్‌ కిట్లను బుధవారం ఆవిష్కరిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రులు, అధికారులు

ఈ దిశగా రాష్ట్రం ముందడుగు వేయడం శుభపరిణామం  

రాష్ట్రంలో తయారైన కిట్లను ఆవిష్కరిస్తూ సీఎం జగన్‌ ప్రశంసలు 

వీడియో కాన్ఫరెన్స్‌తో విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లో తయారీ పరిశీలన

దీనితో పరీక్షలు చేసే సామర్థ్యం మరింత పెరుగుతుందన్న సీఎం

దేశంలోనే తొలిసారిగా కరోనా వైరస్‌ను నిర్ధారించే ర్యాపిడ్‌ టెస్ట్‌

కిట్లను తయారు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించింది. దీనికి తోడు బహిరంగ మార్కెట్‌లో రూ.4,500 ధర ఉన్న ఈ కిట్‌ను కేవలం రూ.1,200కే సమకూరుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిశ్రమల శాఖ ఈ ఘనతను సాధించింది.

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 ర్యాపిడ్‌ టెస్టు కిట్ల తయారీలో రాష్ట్రం స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయడం శుభ పరిణామమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశంసించారు. రాష్ట్రంలో తయారైన కోవిడ్‌–19 ర్యాపిడ్‌ టెస్టు కిట్లను బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం విశాఖపట్నంలోని మెడ్‌టెక్‌ జోన్‌లో ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్ల తయారీని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రచారం, ఆర్భాటం లేకుండా అత్యంత కీలక సమయంలో వైరస్‌ నిర్ధారణ కిట్ల తయారీ రాష్ట్రంలో ప్రారంభమవడం వల్ల పరీక్షలు చేసే సామర్థ్యం మరింత పెరుగుతుందన్నారు. రాష్ట్రానికి కావాల్సిన వెంటిలేటర్లను కూడా వీలైనంత త్వరగా అందించాలని సూచించారు. టెస్ట్‌ కిట్ల తయారీ, పనిచేసే విధానాన్ని మెడ్‌టెక్‌ జోన్‌ సీఈఓ డా.జితేంద్ర శర్మ, సిబ్బంది ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలు ఇలా..

► దేశంలో మూడు కంపెనీలకు మాత్రమే కిట్ల తయారీకి సంబంధించి అనుమతులున్నాయి. రాష్ట్రంలోని మెడ్‌టెక్‌ జోన్‌లో మోల్‌ బయో సంస్థ ఈ కిట్ల తయారీ ప్రారంభించింది. త్రీడీ ప్రింటింగ్‌ ల్యాబొరేటరీలో కిట్లు తయారవుతున్నాయి.  
► ప్రభుత్వ ఆదేశాల మేరకే టెస్ట్‌ కిట్లు, వెంటిలేటర్లు, పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ కిట్ల తయారీకి త్వరితగతిన చర్యలు తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు.
► ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గౌతమ్‌ రెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ పాల్గొన్నారు. 
సీఎంకు టెస్ట్‌ కిట్‌ పని విధానాన్ని వివరిస్తున్న మెడ్‌టెక్‌ ప్రతినిధులు 

 కిట్లు..
ఏప్రిల్‌ రెండో వారానికి రోజుకు 10 వేల కిట్లు, మే నెల మొదటి వారానికి రోజుకు 25 వేల కిట్లు తయారు చేసేలా ప్రణాళిక.
 
వెంటిలేటర్లు
అత్యంత కీలకమైన వెంటిలేటర్ల తయారీ కూడా ప్రారంభమైంది. ఈ నెలలో 3 వేల వెంటిలేటర్లు తయారవుతాయి. మే నుంచి ప్రతి నెలా 6 వేల వెంటిలేటర్లు తయారవుతాయి.

పీపీఈలు
ప్రస్తుతం రోజుకు 2 వేల పర్సనల్‌ ఎక్విప్‌మెంట్‌ కిట్లు తయారవుతున్నాయి. రోజుకు 10 వేల పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ కిట్ల చొప్పున మూడు రోజుల్లో మరో 30 వేల పీపీఈలు అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ రాష్ట్రంలోనే తయారవుతున్నాయి.

దేశంలోనే తొలిసారి..
దేశంలోనే తొలిసారిగా కరోనా వైరస్‌ నిర్ధారించే ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను తయారు చేయడం ద్వారా ఏపీ రికార్డు సృష్టించింది. దేశంలోకి కరోనా వైరస్‌ ప్రవేశించిన వెంటనే దాని కట్టడికి అవసరమైన వైద్య పరికరాల తయారీపై దృష్టి సారించమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారని, దీంతో 35 రోజుల్లోనే ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చామని పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. విశాఖలోని మెడ్‌టెక్‌ జోన్‌లో అభివృద్ధి చేసిన ఈ కిట్లకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) అనుమతి లభించిందన్నారు. బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. 

► బహిరంగ మార్కెట్‌లో ఈ కిట్‌ ధర రూ. 4,500 ఉండగా కేవలం రూ. 1,200కే అందజేస్తున్నాం. 
► ఒక్కో కిట్‌ ద్వారా రోజుకు 20 టెస్టులు చేయవచ్చు. కేవలం 55 నిమిషాల్లోనే ఫలితం తెలుసుకోవచ్చు. 
► బ్యాటరీ ఆధారంగా పని చేసే ఈ కిట్లను మారుమూల ప్రాంతాలకు కూడా తీసుకెళ్లవచ్చు. 
► రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత మిగిలిన రాష్ట్రాలకు ఎగుమతి చేస్తాం. 
► హిందుస్థాన్‌ లైఫ్‌ కేర్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎల్‌ఎల్‌) సంస్థతో కలసి ఏప్రిల్‌ 15 నుంచి నెలకు 3,000 వెంటిలేటర్లు తయారు చేయనున్నాం. ఒక్క వెంటిలేటర్‌ సహాయంతో ఐదారు మందికి వైద్యం చేసేలా వీటిని అభివృద్ధి చేస్తున్నాం. 

వెయ్యి కిట్లు ప్రభుత్వానికి అందజేశాం: 
పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ 
► పరిశ్రమల శాఖ తరఫున 1,000 టెస్టింగ్‌ కిట్లను,    రూ. 10 లక్షలు విలువ చేసే 10 వేల లీటర్ల హ్యాండ్‌ శానిటైజర్‌ను కూడా ప్రభుత్వానికి అందజేశాం.
► ఏపీఐఐసీ ఉద్యోగుల ఒకరోజు వేతనం (రూ. 5,04,570) ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించాం.  

మరిన్ని వార్తలు