నాడు డిమాండ్‌ చేశారు: నేడు ఆచరించారు

7 May, 2020 21:00 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటంలో ఎప్పుడూ ముందుంటారని మరోసారి రుజువైంది. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో నగరం గ్యాస్‌ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా డిమాండ్‌ చేసిన ఆయన.. వైజాగ్‌ గ్యాస్‌ లీకేజీ మృతుల కుటుంబాలకు కోటి ఆర్థిక సాయం అందించి ఆచరణలో పెట్టారు.  

ప్రతిపక్ష నేతగా ఉండగా..
2014 జూన్‌ నెలలో తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం.. నగరం గ్రామంలో గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలి పలువురు మృత్యువాతపడ్డారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పర్యటించిన ఆయన దుర్ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారం ఎంతమాత్రం సరిపోదని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే గెయిల్‌కు కానీ, ఓఎన్జీసీకి కానీ ఒంట్లో భయం పుట్టాలంటే కనీసం కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 
( ‘కోటి ఆర్థిక సాయం సామాన్య విషయం కాదు’)

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా..
నగరం ప్రమాదం జరిగిన దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఈ గురువారం వైజాగ్‌ గ్యాస్‌ లీక్‌ ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దుర్ఘటనపై వెను వెంటనే స్పందించటమే కాకుండా.. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ తగిన విధంగా సహాయక చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం బాధితులను పరామర్శించి, మృతుల కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారందరికీ రూ.10 లక్షలు, బాధిత గ్రామాల్లోని 15 వేలమందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు, జంతు నష్టం జరిగిన వారిని ఆదుకుంటామని చెప్పారు. ఒక్కో జంతువుకు రూ.25 వేల నష్టపరిహారం, ఎల్జీ కంపెనీలో బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

మరిన్ని వార్తలు