బియ్యం నాణ్యతపై రాజీపడొద్దు

3 Dec, 2019 04:50 IST|Sakshi
సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో మంత్రి కొడాలి నాని, అధికారులు

ఏప్రిల్‌ నుంచి అన్ని జిల్లాల్లో నాణ్యమైన, ప్యాకింగ్‌ బియ్యం పంపిణీపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష 

శ్రీకాకుళంలో ప్రజల స్పందన బాగుందన్న అధికారులు 

సాక్షి, అమరావతి: వచ్చే ఏప్రిల్‌ నుంచి అన్ని జిల్లాల్లో నాణ్యమైన, ప్యాకింగ్‌ చేసిన బియ్యం పంపిణీపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో అమలవుతున్న పైలెట్‌ ప్రాజెక్టు వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. శ్రీకాకుళం జిల్లాలో నాణ్యమైన, ప్యాకింగ్‌ బియ్యం పంపిణీపై ప్రజల స్పందన బాగుందని అధికారులు తెలిపారు.

రైతుల నుంచి బియ్యం సేకరణ, ప్యాకేజ్డ్‌ యూనిట్ల ఏర్పాటు, గోడౌన్లలో బియ్యాన్ని భద్రపరుస్తున్న తీరు తదితర అంశాలను సీఎం జగన్‌ సమీక్షించారు. ఎక్కడా అలసత్వానికి తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి లబ్ధిదారుడికి నాణ్యమైన బియ్యాన్ని ప్యాక్‌ చేసి ఇంటివద్ద అందించాలని, నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడరాదని స్పష్టం చేశారు. ప్రతి దశలోనూ బియ్యం నాణ్యత పరిశీలించే ఏర్పాట్లు చేయాలన్నారు. బియ్యాన్ని పంపిణీ చేసే ప్లాస్టిక్‌ బ్యాగులను తిరిగి ఇచ్చేలా అవగాహన కల్పించాలని, లేదంటే వాటివల్ల పర్యావరణం దెబ్బతింటుందని సీఎం అధికారులకు సూచించారు.   

మరిన్ని వార్తలు