ఏసీబీ పనితీరుపై సీఎం జగన్‌ ఆగ్రహం

2 Jan, 2020 13:09 IST|Sakshi

లంచం తీసుకోవాలంటే భయపడాలి

మూడు నెలల్లో మార్పు కనిపించాలి

మరో నెల రోజుల్లో సమీక్ష చేస్తాం : సీఎం జగన్‌

సాక్షి, తాడేపల్లి:  అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పనితీరుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆశించిన రీతిలో ఏసీబీ పనితీరు కనిపించడం లేదంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీబీపై సీఎం జగన్‌ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏసీబీలో అధికారులు మరింత చురుగ్గా, క్రియాశీలంగా అంకిత భావంతో పని చేయాలని  ఈ సందర్భంగా సూచించారు.



సమావేశంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ..‘ఏసీబీలో పనిచేస్తున్న సిబ్బందికి అలసత్వం ఉండకూడదు. అవినీతి నిరోధానికి 14400 కాల్‌ సెంటర్‌ ఏర్పాటు వెనుక మంచి కారణాలు ఉన్నాయి. కాల్‌ సెంటర్‌ ఏర్పాటు వల్ల మంచి ఫలితాలు కనిపించాలి. ప్రజలెవ్వరూ కూడా అవినీతి బారిన పడకూడదు. లంచాలు చెల్లించే పరిస్థితి ఎక్కడా ఉండకూడదు. ఎమ్మార్వో, కార్యాలయాలు, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు, టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసుల్లో ఇలా ఎక్కడా కూడా అవినీతి కనిపించకూడదు. లంచం తీసుకోవాలంటే భయపడే పరిస్థితి రావాలి. సెలవులు లేకుండా పని చేయండి. మూడు నెలల్లోగా మార్పు కనిపించాలి. కావాల్సినంత సిబ్బందిని తీసుకోండి. ఎలాంటి సదుపాయాలు కావాలన్నా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మరో నెల రోజుల్లో సమీక్ష చేస్తాం. అప్పటికి మార్పు కనిపించాలి’ అని స్పష్టం చేశారు. ఈ సమీక్షా  సమావేశంలో సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఏసీబీ డీజీ కుమార్‌ విశ్వజిత్‌, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు