రాష్ట్రంలో లాక్‌డౌన్‌.. సీఎం జగన్‌ సమీక్ష

25 Mar, 2020 16:55 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలవుతున్న తీరుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లాక్‌డౌన్‌ ప్రకటన వెలువడ్డ నుంచి నిత్యావసరాల కోసం ప్రజలు రైతు బజార్లు, కిరాణ దుకాణాల ముందు పెద్ద ఎత్తున క్యూ కట్టడం, జనాల రాకతో నిత్యావసర దుకాణాలు, రైతు బజార్లు, పండ్ల మార్కెట్ల వద్ద ఎక్కువ రద్దీ నెలకొంటుందని సీఎం దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. 

ప్రజలు లాక్‌డౌన్‌ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు పడకూడదని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. నగరాలు, పట్టణాల్లో రైతు బజార్లను పెద్ద ఎత్తున వికేంద్రీకరించాలన్నారు. అంతేకాకుండా ఒకే చోట కాకుండా నగరాలు, పట్టణాల్లో ప్రాంతాల వారీగా కూరగాయలు అమ్మేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రతీ దుకాణం వద్ద సామాజిక దూరం పాటించేలా మార్కింగ్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిన అధికారులు రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైతు బజార్లలో ప్రజలు సామాజిక దూరంగా పాటించేలా మార్కింగ్‌లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు బజార్లలో మార్కింగ్‌ను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. 

కాగా, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో బుధవారం ఉదయం నుంచే మంత్రులు, వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. అన్ని దుకాణాలు, రైతు బజార్ల వద్దకు వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా కూరగాయలు అధిక ధరలు అమ్మే దుకాణాలను సీజ్‌ చేయాలని అధికారులకు సూచిస్తున్నారు. అదేవిధంగా లాక్‌డౌన్‌ సమయంలో రోడ్లపైకి అనవసరంగా వస్తున్న ప్రజలకు ప్రస్తుతం పరిస్థితిని వివరిస్తూ స్వీయ నియంత్రణ, స్వీయ నిర్భందం ప్రతీ ఒక్కరూ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

చదవండి:
జర్నలిస్టుకు కరోనా పాజిటివ్‌
కరోనా: మూడో టెస్టులోనూ పాజిటివ్‌!

మరిన్ని వార్తలు