వ్యవసాయ సలహా మండళ్లు

2 May, 2020 02:54 IST|Sakshi

రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రం, జిల్లా, మండల స్థాయిలో ఏర్పాటు

వ్యవసాయం, అనుబంధ ఉత్పత్తులు, మార్కెటింగ్, ధరలపై సమీక్షలో సీఎం జగన్‌

రైతు భరోసా కేంద్రాలకు నెట్, విద్యుత్, ఇతర సౌకర్యాలన్నీ వెంటనే కల్పించాలి

ఏ ఊరిలో ఏ పంట వేస్తే మేలన్న విషయమై ఆర్‌బీకేల ద్వారా అవగాహన కలిగించాలి

పంటలు రోడ్డుపై వేసిన ఘటనలు గత ప్రభుత్వ హయాంలో రోజూ కనిపించేవి

ఈ ప్రభుత్వ హయాంలో ఆ తరహా ఘటనలు కనిపించడానికి వీల్లేదు

రైతులకు అన్యాయం జరిగితే ఉపేక్షించొద్దు

ప్రతి ఊళ్లో ఏయే పంటలు ఎంత మేర పండించాలన్న దానిపై రైతులతో కలిసి కూర్చుని చర్చించి నిర్ణయించాలి. జాతీయ అంతర్జాతీయంగా వివరాలను విశ్లేషించి.. ఆ మేరకు కార్యాచరణ ఉండాలి. ఈ నేపథ్యంలో రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వడానికి వ్యవసాయ సలహా మండళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.

రైతు భరోసా కేంద్రాలకు ఇంటర్నెట్,విద్యుత్‌ సహా అన్ని సౌకర్యాలను వెంటనే కల్పించాలి. ఏ ఊరిలో ఏ పంట వేస్తే మార్కెట్‌లో మంచి ధర వస్తుందనే విషయాన్ని రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) ద్వారా రైతులకు అవగాహన కలిగించాలి.

గత ప్రభుత్వం ఏ రోజూ వ్యవసాయం మీద దృష్టి పెట్టలేదు. మన ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం, అనుబంధ రంగాలు, వాటి పరిస్థితుల మెరుగుదల కోసం ప్రత్యేకంగా దృష్టి సారించాం. రైతులకు అన్ని విధాలా న్యాయం చేకూర్చే విషయమై విస్తృతంగా సమీక్షించుకుంటున్నాం. ఇంత చేస్తున్నప్పుడు కచ్చితంగా ఫలితాలు రావాల్సిందే.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రైతుల సంక్షేమం కోసం మార్కెట్‌ పరిస్థితులను విశ్లేషించి, ఏ పంటలకు ఎంత డిమాండ్‌ ఉంటుందన్న ముందస్తు అంచనాతో వారికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి రాష్ట్రం, జిల్లా, మండల స్థాయిలో వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ, స్థానిక మార్కెట్ల స్థితిగతులను పరిశీలించి, భవిష్యత్‌ డిమాండ్‌ అంచనాను శాస్త్రీయంగా విశ్లేషించి.. నమ్మకమైన సలహాలను అందిస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. తద్వారా ఏ పంటలు ఎంత మేర సాగు చేయాలని రైతులే నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులు, మార్కెటింగ్, ధరలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానం సేకరణ అన్ని జిల్లాల్లో చురుగ్గా సాగుతోందని అధికారులు వివరించారు. ఇదే సమయంలో కృష్ణా జిల్లాల్లో బస్తాకు కొంత ధాన్యం మినహాయించుకుంటున్నారని రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై చర్చించారు. సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.

అందరం ఉన్నా ఇలా జరిగిందా..
► బస్తాకు కొంత ధాన్యం మినహాయిస్తున్నారని కృష్ణా జిల్లా రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదు లపై సీఎం తీవ్రంగా స్పందించారు. ఈ విధంగా ఎలా మినహా యిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
► ముఖ్యమంత్రి, చీఫ్‌ సెక్రటరీ, సెక్రటరీ, డీజీపీ లాంటి వ్యక్తులంతా ఇదే కృష్ణా జిల్లాలో ఉన్నా సరే.. ఇలాంటి ఘటనలు చోటు చేసు కోవడం సరికాదన్నారు. ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకునే పరిస్థితి వద్దన్నారు.
► వెంటనే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు  అన్యాయం జరిగితే చూస్తూ ఊరు కోవద్దని, అన్యాయం చేసే వారిని ఉపేక్షిం చరాదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.  

ఫలితాలు రావాల్సిందే
► పంటలను రోడ్డు మీద వేసిన ఘటనలు గత ప్రభుత్వ హయాంలో రోజూ కనిపించేవి. అలాంటి ఘటనలు ఈ ప్రభుత్వ హయాంలో కనిపించడానికి వీల్లేదు. 
► చీనీ, అరటి, టమాటా, మామిడి ప్రాసెసింగ్‌ ప్లాంట్లపై దృష్టి పెట్టాలి. వచ్చే ఏడాది.. మళ్లీ ఈ పంటల మార్కెటింగ్‌లో సమస్యలు రాకూడదు.
► సమీక్షలో సీఎస్‌ సాహ్ని, మంత్రి కన్న బాబు, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పాల్గొన్నారు.

ధర ముందుగానే ప్రకటించాలి
► వ్యవసాయ సలహా మండళ్లు రాష్ట్రం, జిల్లా, మండలం స్థాయిలో ఏర్పాటు కావాలి. ఈ మేరకు వెంటనే కార్యాచరణ రూపొందించాలి.
► రాష్ట్ర స్థాయి అగ్రికల్చర్‌ అడ్వైజరీ బోర్డులు జిల్లా స్థాయి బోర్డులకు.. అక్కడి నుంచి మండల స్థాయి అడ్వైజరీ బోర్డులకు ఏయే పంటలు, ఎక్కడ వేయాలన్న దానిపై రైతులకు సూచనలు చేయాలి.
► పంటలు వేసేటప్పుడే ధర ప్రకటించి, ఆ రైతుకు ఆ ధర దక్కేలా చూడాలి. దీనివల్ల రైతుల్లో విశ్వాసం కలుగుతుంది. 
► పంటలను ఇ– క్రాపింగ్‌ చేయడం, రైతు భరోసా కేంద్రాలను వినియోగించి వాటిని కొను గోలు చేయడం.. ఈ ప్రక్రియలన్నీ.. వ్యవస్థీకృ తంగా సాగిపోయేలా చర్యలు తీసుకోవాలి. 

మరిన్ని వార్తలు