రైతు భరోసా కేంద్రాలపై సీఎం జగన్‌ సమీక్ష

27 Apr, 2020 20:22 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : రైతు భరోసా కేంద్రాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫార్మర్‌ క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డులు తీసుకొస్తే రైతులకు మరింత ఉపయోగం ఉంటుందని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బు డెబిట్‌ కార్డు ద్వారా రైతుకు అందాలన్నారు. సంబంధిత బ్యాంక్‌కు వెళ్ళి కార్డు చూపగానే డబ్బు రైతు చేతికిచ్చేలా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ ఖరీఫ్‌ కల్లా 56 లక్షల క్రెడిట్‌, 56 లక్షల డెబిట్‌ కార్డులు సిద్ధం చేయాలని సూచించారు. ఆక్వా రైతులకు నాణ్యమైన ఫీడ్‌, సీడు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి చోటా ఆక్వా టెస్టింగ్‌ ఫెసిలిటీ ఉండాలని ఆదేశించారు. పర్టిఫై చేసి నాణ్యమైన విత్తనాలను మాత్రమే రైతులకు ఇవ్వాలన్నారు. అలాగే ప్రకృతి సేద్యానికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు.

మరిన్ని వార్తలు