ముగిసిన సీఎం జగన్‌ విశాఖ పర్యటన

28 Dec, 2019 20:45 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం పర్యటన ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ప్రతిపాదన చేసిన అనంతరం తొలిసారిగా నగర పర్యటనకు వచ్చిన సీఎం జగన్‌కు జిల్లా ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. శనివారం మధ్యాహ్నం 2.30గంటలకు గన్నవరం నుంచి బయలుదేరిన సీఎం జగన్‌.. మధ్యాహ్నం 3.50గంటలకు విశాఖ విమానాశ్రయంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువులు మంత్రులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుంచి కైలాసగిరి, ఆర్కేబీచ్‌లోని విశాఖ ఉత్సవ్‌ వేదిక వరకూ దాదాపు 24 కిలోమీటర్ల మేర భారీ మానవహారం నిర్వహించారు.

(చదవండి : విశాఖలో సీఎం జగన్‌కు ఘనస్వాగతం)

తమ అభిమాన నేతను చూసేందుకు వేల సంఖ్యలో జనం తరలివచ్చారు.  చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా గంటల తరబడి రోడ్డుపై నిల్చోని తమ అభిమాన నేత జగనన్న కోసం ఎదురు చూశారు. ప్లకార్డులు, జెండాలు పట్టుకొని సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం పలికారు. కారులో ఉన్న సీఎం జగన్‌లో సెల్ఫీలు దిగేందుకు జనం పోటీపడ్డారు.  కైలాసగిరి నుంచి సెంట్రల్‌పార్క్‌కు, సెంట్రల్‌ పార్క్‌ నుంచి ఆర్‌కేబీచ్‌కు ఇలా సీఎం వచ్చే దారిలో స్వాగత మానవ తోరణంతో  సీఎంకు థాంక్స్‌ చెప్పారు.

(చదవండి : విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌)

దాదాపు రెండు గంటల పాటు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించిన సీఎం జగన్‌.. కైలాసగిరికి చేరుకొని పలు అభివృద్ధి కార్యాక్రమాలను ప్రారంభించారు. ఒకేసారి ఏకంగా రూ.1285.32 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. కైలాసగిరిలో వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న రూ.379.82 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. కైలాసగిరిపై రూ.37 కోట్లతో నిర్మించనున్న ప్లానెటోరియానికి శంకుస్థాపన చేశారు.

అక్కడ నుంచి బయలుదేరి నేరుగా  వైఎస్సార్‌ సెంట్రల్‌ పార్క్‌కు వెళ్లి జీవీఎంసీ చేపట్టనున్న రూ.905.50 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆర్‌కే బీచ్‌కు చేరుకుని  విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభిచారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ విశాఖ నేవీ కోస్ట్ సిబ్బందికి చిరు సన్మానం చేశారు. అలాగే.. విశాఖ ఉత్సవ్ కమిటీ నుంచి జగన్‌కు వారు సన్మానం చేశారు. అనంతరం సాయంత్రం 7.40 గంటలకు తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి బయలుదేరి వెళ్లారు. 

మరిన్ని వార్తలు