నేడు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ప్రారంభం

24 Apr, 2020 04:37 IST|Sakshi

పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట నెరవేరుస్తున్న సీఎం

క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి పథకాన్ని ప్రారంభించనున్న వైఎస్‌ జగన్‌

ఆ వెంటనే 90,37,254 మంది మహిళల ఖాతాల్లోకి రూ.1400 కోట్లు జమ

వడ్డీ భారం ప్రభుత్వానిదేనని పొదుపు సంఘాల మహిళలకు ఇప్పటికే లేఖ 

సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక పక్క కరోనా వైరస్‌తో రాష్ట్ర ఆదాయం పూర్తిగా నిలిచిపోయింది. మరో పక్క కేంద్రం నుంచి వచ్చే నిధులూ తగ్గిపోయాయి. ఇంకో పక్క పేదలను ఆదుకోవడానికి ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీతో పాటు పేద కుటుంబాలకు 1000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పొదుపు సంఘాల అక్క చెల్లమ్మలకు ఇచ్చిన మాట నెరవేర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. 
►ఇందులో భాగంగా శుక్రవారం వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు. క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో పొదుపు సంఘాల అక్క చెల్లమ్మల ఖాతాలకు సున్నా వడ్డీ డబ్బులను జమ చేసే బటన్‌ను నొక్కుతారు. 
►ఈ బటన్‌ నొక్కగానే సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా ఒకే విడతన డబ్బులు జమ అవుతాయని సెర్ప్‌ సీఈవో రాజాబాబు తెలిపారు.
►90,37,254 మహిళలు సభ్యులుగా ఉండే ఆయా సంఘాల ఖాతాల్లో రూ.1,400 కోట్లు ఒకే విడత జమ అవుతుంది. కాగా, ఇప్పటికే మీ రుణాలపై వడ్డీ భారం ప్రభుత్వానిదేనని పొదుపు సంఘాలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి లేఖ రాసిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు