శ్రీవారి లడ్డూలో బొగ్గు పలుకులు

29 Apr, 2017 19:03 IST|Sakshi
శ్రీవారి లడ్డూలో బొగ్గు పలుకులు

తిరుపతి :  శ్రీవారి లడ్డూలో బొగ్గు పలుకులు వచ్చాయి. యామిని అనే భక్తురాలు క్యూలో నిలుచుని శ్రీవారి లడ్డూ ప్రసాదం తీసుకుంది. ఎంతో పవిత్రమైన ప్రసాదాన్ని ఆరగిద్దామని లడ్డూను తుంచుగా అందులో బొగ్గు పలుకులు వచ్చాయి. దీంతో ఆ భక్తులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. లడ్డూలో బొగ్గు పలుకులు వచ్చిన విషయాన్ని టీటీడీ అధికారులు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న టీటీడీ ఆరోగ్య శాఖ అధికారిణి శర్మిష్టా బూందీ పోటును శనివారం తనిఖీ చేశారు. అక్కడి పోటు అధికారురులతో పాటు తయారీ దారులను బొగ్గు పలుకులు ఎలా వచ్చాయని శర్మిష్టా ఆరా తీశారు.

అయితే బూందీ మాడటం వల్లే బొగ్గు పలుకులుగా మారిందని అక్కడి సిబ్బంది వివరించారు. దీంతో శర్మిష్ట మీడియాతో మాట్లాడుతూ లడ్డూల తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన లడ్డూ నాణ్యత విషయంలో రాజీ వుండదన్నారు. బూందీ ఎక్కువగా మాడిపోవడం వల్లే నల్లగా బొగ్గు పలుకులుగా మారాయన్నారు. అవి లడ్డూలో కలవడం వల్లే బొగ్గుగా కనిపించిందని ఆమె తెలిపారు.  కాగా గతంలోనూ లడ్డూలో జెర్రి, ఇనుప నట్లు, బోల్టులు వచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు