దొరికారు

14 Feb, 2014 02:30 IST|Sakshi

బెల్లంపల్లి/తాండూర్, న్యూస్‌లైన్ : సింగరేణిలో ‘బొగ్గు దొంగల’ కథనం సంచలనం సృష్టించింది. ఈ దందాపై సాక్షి దినపత్రికలో డిసెంబర్ 27న బొగ్గు దొంగలు.. జనవరి 7న ఆగని దందా..  జనవరి 19న విచారణ బొగ్గేనా? శీర్షికలతో కథనాలు ప్రచురించింది. స్పందించిన అధికారులు విచారణ చేపట్టారు. బొగ్గు అక్రమ రవాణా కేసు లో 13 మంది నిందితులను గురువారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.65.90 లక్షల నగదు, నాలుగు తులాల బంగారం, నకిలీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. 15 బొగ్గు టిప్పర్లు(లారీలు), ఇండికా కారును పోలీసులు సీజ్ చేశారు. మరో నాలుగు లారీలను సీజ్ చేయాల్సి ఉంది.

 620 ట్రిప్పుల బొగ్గు అక్రమార్గం
 తాండూర్ మండల కేంద్రంలోని మాదారం ఠాణా ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ భాస్కర్‌భూషణ్, డీఎస్పీ కె.ఈశ్వర్‌రావు వివరాలు వెల్లడించారు. బెల్లంపల్లి ఏరియా డోర్లి-2  ఓసీపీ నుంచి నకిలీ వే బిల్లులతో బొగ్గు అక్రమ రవాణాకు కొంత మంది పాల్పడ్డారని తెలిపారు. తొలుత నలుగురు, ఆ తర్వాత మరో ముగ్గురు అక్రమ దందాకు తెరలేపారన్నారు.

 వీరి తర్వాత మరికొంత మంది లారీ ఓనర్లు ఈ  భాగస్వాములయ్యారన్నారు. డోర్లి-2 ఓసీపీ నుంచి 64 ట్రిప్పుల బొగ్గు అక్రమ రవాణా జరి గినట్లు సింగరేణి అధికారులు ఫిర్యాదు చేసినా తమ విచారణలో 620 ట్రిప్పుల బొగ్గు అక్రమ మార్గం పట్టినట్లు తేలిందన్నారు. ఇందులో 500 ట్రిప్పుల బొగ్గు దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీకి, మరో 120 ట్రిప్పులు మహా రాష్ట్రలోని వాయునందన పవర్ ప్లాంట్‌కు వెళ్లి నట్లు నిందితులు అంగీకరించినట్లు తెలిపారు.

 నిందితులు వీరే..
 బొగ్గు అక్రమ దందాకు పాల్పడిన వారిలో మిట్టపల్లి శంకర్(నరేశ్‌కుమార్ కోల్ ట్రాన్స్‌పోర్టు మాజీ సూపర్‌వైజర్), పురంశెట్టి శంకర్, క్యాతం రవికుమార్, కొంతం రమేశ్, పెసరు నరేశ్, కల్వ ల కుమారస్వామి, దాడి శంకర్, గాజుల దేవ య్య, మిల్కూరి సుధాకర్, కటకం రాజేశ్వర్‌రావు, నరేడ్ల జయకృష్ణారెడ్డి(లారీ యజమాను లు), అవదేశ్‌కుమార్‌సింగ్(దేవాపూర్ ఓరి యం ట్ సిమెంట్ ఫ్యాక్టరీ కమర్షియల్ జనరల్ మేనేజర్), గంగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి(మహారాష్ట్ర వా యునందన్ పవర్‌ప్లాంటుకు బొగ్గు అమ్మించే మధ్యవర్తి)లను అరెస్ట్ చేశారు.

బొగ్గు అక్రమ దందాకు సంబంధం ఉన్న బడా కాంట్రాక్టర్లు కోనేరు ప్రసాద్‌బాబు, దిలీప్ అగర్వాల్, బొగ్గు అమ్మేందుకు మధ్యవర్తిత్వం చేసిన అగర్వాల్ శ్రీనివాస్, లారీ యజమానులు కాంపెల్లి శ్రీని వాస్‌రెడ్డి, బోయిని రవీందర్, మహారాష్ట్రలోని వాయునందన పవర్‌ప్లాంట్ అధికారులు సత్యనారాయణ, పంకజంతోపాటు మరికొందరు బ డా కోల్ కాంట్రాక్టర్లు, అక్రమార్కులు పరారీలో ఉన్నారు. నిందితులను గురువారం అరెస్ట్ చేసి కోర్టుకు పంపినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సైలు అజయ్‌బాబు, మోహన్, రాజేందర్, కుమారస్వామి,సంతోష్‌కుమార్‌సింగ్ ఉన్నారు.

మరిన్ని వార్తలు