తూర్పుగోదావరి: జిల్లాలోని అన్నవరం సత్యదేవుని ఆలయంలో పని చేస్తున్న వ్రత పురోహితులలో సంప్రదాయ ప్రమాణాలు పాటించని 12 మంది వ్రత పురోహితులను సస్పెండ్ చేస్తూ ఆలయ కార్యనిర్వహణాధికారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయం వ్రతాలను ప్రసిద్ధి. ఇక్కడ దాదాపు 250 మంది వ్రత పురోహితులు పని చేస్తున్నారు. మామూలుగా వ్రతాలు చేయించే పురోహితులు నియమాలను పాటించాలి. పంచె కట్టుతో, బొట్టు పెట్టుకుని, పిలక పెట్టుకుని ఉండాలి. ఈ మేరకు రెండు నెలల క్రితం ఈవో సర్కూలర్ జారీ చేశారు.
వ్రత పురోహితులకు రెండు నెలల గడువు ఇచ్చారు. అయినా కొందరు పూజారులు పద్దతి మార్చుకోకుండా సర్కూలర్ను ఉల్లంఘించారు. సంప్రదాయానికి విరుద్ధమైన వేష ధారణతో విధులకు వస్తున్నారు. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం చేయడంతో 12 మంది వ్రత పురోహితులను సస్పెండ్ చేస్తూ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు.