‘పోలీసుల అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించరాదు’

7 Mar, 2020 19:41 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప : నేటి నుంచి (శనివారం) జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటుందని కలెక్టర్‌ హరికిరణ్‌ తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ హరికిరణ్‌, ఎస్పీ అన్బురాజన్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, మునిసిపల్‌ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 9వ తేదీ నుంచి 11 తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ స్వీకరించనున్నట్లు తెలిపారు. 14వ తేదీన ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటిస్తామని, 21న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 24న ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. (ఏపీ: ‘స్థానిక’ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల)

కలెక్టర్‌ మాట్లాడుతూ.. ‘‘24 న తేదీ ఉదయం 8 నుండి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం. జిల్లా వ్యాప్తంగా 1985 పోలింగ్ స్టేషన్ గుర్తించాము. జిల్లా స్థాయిలో 20 వేల మంది సిబ్బందితో ఎన్నికల నిర్వహణ  చేపడతాము.. గ్రామ, వార్డు వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధులకు ఉపయోగించకూడదని ఆదేశాలు జారీ చేశాము. ఎన్నికలకు 10879 బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయి. 1821 బాక్సులు అదనంగా కావాల్సి ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తెలిపాము. ప్రతి పోలింగ్ బూత్‌లో అన్ని మౌలిక సదుపాయాల కల్పిస్తాం. మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ ఏ మునిసిపాలిటీ కి సంబంధించి అక్కడే జరుగుతాయి. 807 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏవి కూడా కోర్టులో కేసులు లేవు. అన్ని చోట్ల ఎన్నికలు జరుగుతాయి. రాజంపేట, బద్వేలు ఎన్నికలకు హైకోర్టు స్టే వచ్చినట్లు సమాచారం. ఈ రెండు ప్రాంతాలు తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా జరుగుతాయి’’. అని పేర్కొన్నారు. (‘ఆయన సిగ్గు, శరం లేని మనిషి’)

ఎస్పీ అన్బురాజన్‌ మాట్లాడుతూ.. ఎన్నికల్లో భాగంగా ఎక్కడా అక్రమంగా డబ్బులు, మద్యం తరలిస్తే, పంచినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసు అనుమతి లేకుండా ఎక్కడా ప్రచారం నిర్వహించరాదని, ఎన్నికలు సజావుగా జరిగేందుకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అవసరమైతే  పక్క జిల్లాల నుంచి ఫోర్స్‌ను వాడుకుంటామని తెలిపారు. 6 వేల మంది భారీ పోలీసు బలగాలతో ఎన్నికల నిర్వహణ చేపడుతున్నట్లు, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సహకారంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. (ఏపీ : జెడ్పీ రిజర్వేషన్లు.. 6 స్థానాలు వారికే)

స్థానిక సంస్థల ఎన్నికలపై బొత్స కీలక ప్రకటన

మరిన్ని వార్తలు