తుపానుపై భయాందోళన వద్దు

17 Dec, 2018 13:30 IST|Sakshi

అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం

కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా  

తూర్పుగోదావరి, కాకినాడ సిటీ: తుపానుకు సంబంధించి అవసరమైన అన్ని ముం దస్తు చర్యలూ తీసుకున్నామని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అన్నారు. కలెక్టరేట్‌లో ఏ ర్పాటు చేసిన కాకినాడ, అమలాపురం తుపాను కంట్రోల్‌ విభాగంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే..

కోస్తా ప్రాంతంలోని 17 మండలాల్లో 295 గ్రామాలపై తుపాను ప్రభావం చూపే అవకాశం ఉంది.
తుపాను సమయంలో నష్టపోయే 77 రోడ్లు గుర్తించాం. వీటిలో కోస్తాలో 44, సమీప ప్రాంతాల్లో 33 ఉన్నాయి. ఈ రోడ్లపై ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా చేయడానికి ప్రత్యేక బృందాలను నియమించాం. ఎక్కడైనా చెట్లు నేలకొరిగితే వాటిని తొలగించి రహదారిని క్లియర్‌ చేసేందుకు వీలుగా జేసీబీలను, కూలీలను సిద్ధం చేశాం. ఇందుకోసం ప్రతి 20 కిలోమీటర్లకు ఒక అధికారుల బృందాన్ని నియమించాం.
తుపాను సహాయక చర్యల కోసం 14 మంది డీఈలు, 33 మంది ఏఈలు, 96 మంది అగ్నిమాపక సిబ్బంది, ఏడు జేసీబీలు, 10 వేల లీటర్ల డీజల్‌ సిద్ధం చేశాం.
కోస్తా ప్రాంతంలోని 57 మంచినీటి పథకాల వద్ద జనరేటర్లు ఏర్పాటు చేశాం.
26 విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల (33/11 కేవీ) వద్ద సిబ్బందిని, జేసీబీలను సిద్ధంగా ఉంచాం.
కాకినాడ – తుని మధ్య అత్యవసర పనుల కోసం 4 వేల విద్యుత్తు స్తంభాలు సిద్ధం చేశాం.
జిల్లాలోని 500 సెల్‌ టవర్ల పనితీరుకు ఆటంకం లేకుండా అవసరమైన జనరేటర్లు, ఇంధనం, సిబ్బందిని అందుబాటులో ఉంచాం.
283 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశాం. 61 తుపాను షెల్టర్లు సిద్ధం చేశాం. సహాయ శిబిరాల్లో బాధితులకు అందించడానికి 3 వేల దుప్పట్లు, 770 రెయిన్‌ కోట్లు సమకూర్చాం. సహాయ శిబిరాల వద్ద ఆహార పంపిణీకి 1664 మంది వంట సిబ్బందిని నియమించారు. 61 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.
సహాయ శిబిరాల కోసం 60 వాహనాలు, రోడ్లపై ఆటంకాలను తొలగించడానికి 200 తుపాను పవర్‌ బ్లేడులు సిద్ధం చేశాం.
సముద్రంలో వేటకు వెళ్లిన రెండు మత్స్యకార పడవల్లో ఏడుగురితో కూడిన ఒక పడవను సమీపంలోని ఓఎన్‌జీసీ రిగ్‌ వద్దకు తరలించాం. కొత్తపాలేనికి చెందిన పడవను ఓడలరేవులో గుర్తించాం.
అమలాపురం, కాకినాడల్లో కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేశాం.

మరిన్ని వార్తలు