కలెక్టర్ ప్రద్యుమ్న
చిత్తూరు ,కలెక్టరేట్: చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించడంతోపాటు జీవితాంతం ప్రభుత్వ పథకాలు, రాయితీలను నిలిపి వేస్తామని కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కో–ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. చిన్న పిల్లలపై అత్యాచారాలు, మహిళలను హింసించడం లాంటి సంఘటనలపై తక్షణం స్పందించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
ఇందుకోసం పోలీసు, రెవెన్యూ, ఐసీడీఎస్, డీఆర్డీఏ శా ఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. నెలకోసారి సమావేశం నిర్వహించి మహిళల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చిన్న పిల్లలపై లైంగిక దాడులు జరిగితే 164 చట్టం ప్రకారం 24 గంటలలోపు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ స్థాయిలో కరపత్రాలు, ర్యాలీల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. డీఆర్ఓ గంగాధరగౌడ్, ఏఎస్పీ రాధిక, ఆర్డీఓ కోదండరామిరెడ్డి, మదనపల్లె ఇన్చార్జ్ సబ్కలెక్టర్ గుణభూషణ్రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.