ఆ జిల్లాలో ఒక్కరోజే మూడు కేసులు నమోదు

4 Apr, 2020 11:26 IST|Sakshi

సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లాలో ఈ రోజు(శనివారం) 3 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నిర్ధారించినట్లు కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు. కర్నూలు నగరం రోజా వీధి, అవుకు, బనాగనిపల్లె పట్టణ కేంద్రాలలో ఒక్కొక్కటి చొప్పున 3 కేసులు నిర్ధారణ అయ్యాయన్నారు. శనివారం జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నోస్సంతో కలిపి ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం, సాయంత్రం తిరుపతి, అనంతపురం కరోనా ల్యాబ్‌ల నుంచి మరిన్ని రిపోర్టులు వస్తాయని, రిపోర్టులు వచ్చిన తరువాత కేసుల వివరాలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తామన్నారు.

కలెక్టర్ వీరపాండియన్ తెలిపిన వివారల మేరకు:
మొత్తం  శాంపిల్స్‌ టెస్టింగ్‌కు పంపినవి 449
వారిలో ఢిల్లీ జయాత్‌కు వెళ్లి జిల్లాకు వచ్చిన వారి శాంపిల్స్‌ టెస్టింగ్‌కు పంపినవి 338.
శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం.. అనంతపురం, తిరుపతి కరోనా ల్యాబ్‌ల నుంచి రిపోర్టులు వచ్చినవి:90 (నిన్న రాత్రి 80 నెగెటివ్)
ఈ రోజు ఉదయం రిపోర్టులు వచ్చినవి 10
వాటిలో 7 నెగటివ్;  పాజిటివ్:3 (ఢిల్లీ జమాత్ వెళ్లి వచ్చిన వారిలో) 

ప్రజలు ఆందోళన చెందకుండా.. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి కోసం స్థానిక అధికారులు, పోలీసులు తీసుకునే జాగ్రత్త చర్యలకు సహకరించాలని కలెక్టర్ కోరారు. కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం పాజిటివ్ వచ్చిన 3 కేసుల ప్రాంతాల్లో ..కర్నూలు రోజా వీధి  చుట్టు పక్కల 3 కిలోమీటర్ల కంటైన్మెంట్ జోన్, 5 కిలో మీటర్ల బఫర్ జోన్,  అవుకు, బనాగనిపల్లె పట్టణాల్లో 3 కిలోమీటర్ల కంటైన్ మెంట్ జోన్, 7 కిలోమీటర్ల బఫర్ జోన్ ప్రకటించామని అన్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ అయిన వారందరూ తక్షణమే హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. వారికి కరోనా టెస్ట్ లు చేయించడానికి, టోటల్ శానిటేషన్ చర్యలు చేపట్టాలని మునిసిపల్ కమిషనర్లు, ఇన్సిడెండ్ కమాండర్స్, ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

అందరూ అప్రమత్తంగా ఉండాలి.
‘‘పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనల ప్రకారం నిత్యావసరాలకు ఇబ్బంది లేదు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తాం. పాజిటివ్ వచ్చిన ప్రాంతాన్ని మొత్తం 4 సెక్టర్లుగా విభజించి మెడికల్ బృందాలతో ఆ ప్రాంతంలో నివాసమున్న వారందరికీ  మెడికల్ స్క్ర్రీనింగ్ చేయిస్తాం. ఆ ప్రాంతమంతా క్రిమీ సంహార రసాయనాల స్ప్రే చేయించి.. శానిటేషన్ చేయిస్తున్నాం. అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇళ్లలోనే ఉండండి..బయటకు రావద్దు.. సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించండి. కోవిడ్-19 అనుమాన లక్షణాలు ఉంటే వెంటనే మెడికల్ ఆఫీసర్, మునిసిపల్ కమీషనర్,  తహశీల్దార్, ఎంపిడిఓలకు సమాచారం ఇవ్వండి. కర్నూలు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్  ఏర్పాటు చేసాం.. కర్నూలు కరోనా కాల్ సెంటర్ 9441300005 కు లేదా 104 కు కాల్ చేసి కరోనా పై ఏవైనా సమస్యలు ఉంటే తెలుపవచ్చు. కోవిడ్-19/కరోనా పై వదంతులను/పుకార్లను పుట్టిస్తే లేదా సోషల్ మీడియాలో లేదా మీడియాలో వ్యాప్తి చేస్తే చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు బుక్ చేస్తాం’ అని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు