విశాఖలో ఇసుక కొరత లేదు: కలెక్టర్‌ వినయ్‌ చంద్‌

13 Nov, 2019 19:22 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ బుధవారం ముడసరలోని ఇసుక నిల్వల డిపోలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. విశాఖలో ఇసుక కొరత లేదని వెల్లడించారు. జిల్లాలో మొత్తం ఎనిమిది ఇసుక నిల్వల డిపోలను ఏర్పాటు చేశామని, ప్రతీ డిపోకు ఒక డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారిని ఇన్‌చార్జీగా నియమించి.. ఇసుక సరఫరాను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. అలాగే ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నరోజే ఇసుకను వినియోగదారులకు అందిస్తున్నామని పేర్కొన్నారు.

విశాఖలో ఇప్పటి వరకు 80 మెట్రిక్‌ టన్నుల ఇసుక అందించామని, ప్రస్తుతం 31 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక సరఫరాకు సిద్ధంగా ఉందని కలెక్టర్‌ తెలిపారు. అలాగే జిల్లాలోని శారద, తాండవ నదుల్లో ఇసుక లభ్యం అయితే దానిని స్థానిక అవసరాలకు వినియోగించాలని ఆలోచన చేస్తున్నామని అన్నారు. కాగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే రెండు లక్షల జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష ఉంటుందని, జిల్లాలో ఇసుక కొరత లేకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకంటున్నామని ఆయన తెలిపారు. రేపటి(గురువారం) నుంచి ఇసుక వారోత్సవాలను నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా అదనపు డిపోలు ఏర్పాటు చేయడం,  ప్రతి డిపో వద్ద ఇసుక రేట్ల బోర్డులను ప్రదర్శించడం, అక్రమ రవాణా అరికట్టడం వంటి మూడు అంశాలను ప్రధానంగా తీసుకున్నామని కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు