నిబంధనలు పాటించని స్కూళ్లు, కాలేజీల రద్దు!

17 Feb, 2020 13:06 IST|Sakshi

సాక్షి, విజయవాడ: చాలా చోట్ల పాఠశాలలు, కాలేజీలు కనీస నిబంధనలు పాటించడం లేదని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ రెడ్డి కాంతారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటి గుర్తింపును రద్దు చేయమని ప్రభుత్వానికి సిఫారసు చేస్తామన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొలి విడత తనిఖీలో భాగంగా పదమూడు జిల్లాల్లో ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు, పాఠశాలలను పర్యవేక్షించామని తెలిపారు. అధిక ఫీజుల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఫీజులతో పాటు ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాలను పరిశీలించామన్నారు.

విద్యాబోధనలో లోపాలున్నాయి
వైఎస్‌ చైర్‌పర్సన్‌ విజయ శారద రెడ్డి మాట్లాడుతూ.. తనిఖీలు చేసిన 120 కాలేజీల్లో చాలా చోట్ల కనీస వసతులు లేవన్నారు. పైగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు కానీ అందుకు తగ్గట్టు విద్యాబోధన లేదని వెల్లడించారు. విద్యాబోధనలో చాలా లోపాలను గుర్తించామన్నారు. విద్యార్థులకు మానసిక ఒత్తిడి పెంచి ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తున్నారని మండిపడ్డారు.

మూత్ర విసర్జనకు వెళ్తారని డ్రింకింగ్‌ వాటర్‌కు నో
సెక్రటరీ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. ‘కళాశాలలు, పాఠశాలలు చెత్తకుప్పలుగా ఉన్నాయి. శుభ్రం అనేదే లేకుండా అంతా చెత్తతో నింపేస్తున్నారు. మరోవైపు నారాయణ, చైతన్య సిండికేట్‌ లాగా ఏర్పడి విద్యను వ్యాపారం చేశారు. ఈ కాలేజీలు చంద్రబాబుకు బినామీలుగా మారాయి. టీడీపీకీ పార్టీ ఫండ్‌ ఇస్తూ బాబును మేనేజ్‌ చేసుకుంటూ వచ్చాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా పాఠశాల్లలో విద్యార్థులు యూరినల్స్‌కు వెళ్తారని తాగునీరు సదుపాయాన్ని తగ్గించారని విస్తుపోయారు.

(‘ఇంగ్లిష్‌’తో బాలలకు బంగారు భవిత )

మరిన్ని వార్తలు