సీఎం ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటా..

8 Apr, 2016 02:05 IST|Sakshi
నిలదీస్తున్న దాసరి కృష్ణ

* మంత్రి ప్రత్తిపాటికి రాజధాని రైతు స్పష్టీకరణ
* భూములిచ్చిన వారిని పట్టించుకోవడం లేదని ఆవేదన

సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధానికి భూములు ఇచ్చిన తమను అధికారులు పట్టించుకోవడం లేదని, తనకు న్యాయం జరగకపోతే సీఎం ఇంటి ముందే పెట్రోల్ పోసుకుని తగలబడతానని గుంటూరు జిల్లా ఉండవల్లికి చెందిన రైతు దాసరి కృష్ణ హెచ్చరించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో ఆయనీ హెచ్చరిక చేయడం గమనార్హం. గురువారం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన రైతుల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఆవేదనతో మాట్లాడిన కృష్ణ ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించారు. భూములిచ్చిన రైతుల్ని తహసీల్దార్, ఎంపీడీవో ఇతర అధికారులు పట్టించుకోవడం లేదని, అయినా మీరు అధికారులను అడగడం లేదని మంత్రిని నిలదీశారు. కృష్ణ ఆవేదనకు కారణమేమిటో స్పష్టంగా తెలియలేదు. మంత్రి మాత్రం ‘నీ ఆవేదన ఏమిటో నాకు అర్థమైంది, నేను తర్వాత మాట్లాడతా కూర్చో’ అంటూ బుజ్జగించారు.

>
మరిన్ని వార్తలు