తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈఓ అనీల్ కుమార్ సింఘాల్ విలేకరుల సమావేశంలో తెలిపారు. బ్రహ్మోత్సవాలకు ఇప్పటికే రూ.9.50 కోట్ల విలువైన పనులు పూర్తి చేశామన్నారు. బ్రహ్మోత్సవాల రద్దీని దృష్టిలో ఉంచుకుని గరుడసేవ నాడు(శనివారం) దివ్య దర్శనం రద్దు చేశామన్నారు. విఐపి దర్శనాలు ప్రొటోకాల్కు పరిమితం చేశామని వివరించారు. భక్తులకు వాహన సేవలతోపాటు, మూలవిరాట్ దర్శనం చేయిస్తామని తెలిపారు.
గరుడసేవకు మాడవీధుల్లోని గ్యాలరీల్లో లక్షా 80వేల మంది భక్తులకు వాహన సేవలు తిలకించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. తిరుమలలో 30 ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశామని, 2700 మంది పోలీసులు, 2 వేలమంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, 3 వేల మంది శ్రీవారి సేవకులు, వెయ్యిమంది స్కౌట్స్ , 5వేల మంది టీటీడీ ఉద్యోగులతో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు. భద్రతలో భాగంగా ఫిన్న్ సిస్టమ్, బాడీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఈఓ తెలిపారు. ఈనెల 23న సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.