అజాతశత్రువుకు  అశ్రునివాళి

16 Mar, 2019 12:05 IST|Sakshi
వైఎస్‌ వివేకానందరెడ్డి చిత్రపటానికి  పూలమాలలు వేసి  నివాళులర్పిస్తున్న కన్నబాబు తదితరులు

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై దిగ్భ్రాంతి చెందిన జిల్లావాసులు

 రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రశ్నార్థకమయ్యాయని ఆందోళన

 సీబీఐ విచారణ జరపాలని పలువురి డిమాండ్‌ 

అజాత శత్రువుగా కడప జిల్లా ప్రజలకు ఎనలేని సేవలు అందించిన మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యోదంతంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా శ్రేణులు తీవ్ర దిగ్భాంతి చెందారు. ఆయన హత్య వెనుక కుట్రదాగి ఉందని, నేరస్తులను కఠినంగా శిక్షించాలని నినదించారు. వైఎస్‌ వివేకానంద రెడ్డి మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.  

సాక్షి, కాకినాడ రూరల్‌: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ సోదరుడు, సీనియర్‌ నాయకుడు వైఎస్‌ వివేకానందరెడ్డి అకాల మరణం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటని కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ రూరల్‌ పార్టీ కార్యాలయంలో కన్నబాబు ఆధ్వర్యంలో శుక్రవారం వైఎస్‌ వివేకానందరెడ్డి చిత్రపటానికి  పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వెన్నంటే ఉంటూ పార్టీ కార్యక్రమాలలో ముందుండి నడిపే వివేకానందరెడ్డి అకాల మరణం తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. పార్టీ కాకినాడ రూరల్‌ మండల అధ్యక్షుడు నురుకుర్తి రామకృష్ణ (కిట్టు), రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కర్నాసుల సీతారామాంజనేయులు, నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు గీసాల శ్రీనివాసరావు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి జమ్మలమడక నాగమణి, రాష్ట్ర యువజన కార్యదర్శి లింగం రవి, గొల్లపల్లి ప్రసాదరావు, గంజా సత్యనారాయణ, పుల్ల చైర్మన్‌ శ్రీను, కొత్తపల్లి గిరీష్, పాలిక నర్శింహమూర్తి, సమనాసి ప్రసాద్, చెరుకూరి సుజాత, కొప్పిశెట్టి శివపార్వతి, పాలిక వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు. 


ఆకస్మిక మృతి బాధాకరం : రాజా
తుని: వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి పార్టీకి తీరని లోటని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. స్థానిక శాంతినగర్‌లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం వివేకానందరెడ్డి సంతాప సభ నిర్వహించారు.  ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా వివేకానందరెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  రాజా మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలన్న కోరిక నేరవేరకుండా తుది శ్వాస విడిచి అందరినీ విషాదంలో నింపారని ఆవేదన వ్యక్తం చేశారు.

తుని పట్టణ శాఖ పార్టీ అధ్యక్షుడు రేలంగి రమణాగౌడ్, తుని మండల పార్టీ అధ్యక్షుడు పోతల రమణ, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు నార్ల రత్నాజీ, కీర్తి బాలకృష్ణ, ఎస్సీ సెల్‌ తుని నియోజకవర్గ అధ్యక్షుడు గారా శ్రీనివాసరావు, తుని మండల యూత్‌ కన్వీనర్‌ చోడిశెట్టి వెంకటేష్, నాయకులు వంగలపూడి వాసు, 
శివ, నైషీ, కార్యకర్తలు పాల్గొన్నారు.


వైఎస్‌ వివేకానందరెడ్డికి నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే రాజా  

సీబీఐ విచారణ జరిపించాలి: బోస్‌


రామచంద్రపురం రూరల్‌: మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యతో తీవ్ర దిగ్భాంతికి లోనైనట్లు వైఎస్సార్‌ సీపీ అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అన్నారు. వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూ తెలిపారు. ఎన్నికల సమయంలో వైఎస్సార్‌ సీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నంగా కన్పిస్తోందని శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ప్రతిపక్ష నాయకుడి కుటుంబానికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం రాజకీయాల్లో తిరిగే సామన్యులకు ఏమి రక్షణ కల్పిస్తుందని ఆయన ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి వెంటనే సీబీఐ ఎంక్వయిరీ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని బోస్‌ డిమాండ్‌ చేశారు.  

వైఎస్సార్‌ సీపీకి తీరని లోటు


కోటనందూరు (తుని): వైఎస్‌ వివేకానందరెడ్డి మరణం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటని ఆ పార్టీ కాకినాడ పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు పెదపాటి అమ్మాజీ అన్నారు. ఆమె శుక్రవారం కోటనందూరులో మాట్లాడుతూ  దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి లేని లోటును ఆ కుటుంబానికి వివేకానందరెడ్డి భర్తీ చేసేవారని, ఆయన మరణంతో వైఎస్‌ కుటుంబ సభ్యులకు అన్యాయం జరిగిందన్నారు. మృదుస్వభావి, అందరినీ చిరునవ్వుతో పలకరించే వివేకానందరెడ్డి ఇకలేరనే వార్త పార్టీ శ్రేణులను శోకసంద్రంలో ముంచిందన్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అమ్మాజీ  చెప్పారు. 

మరిన్ని వార్తలు