పార్టీ రక్షణ బాధ్యత కార్యకర్తలదే: బొత్స

14 Sep, 2013 00:22 IST|Sakshi
పార్టీ రక్షణ బాధ్యత కార్యకర్తలదే: బొత్స

రాష్ట్రం సున్నితమైన అంశంతో సతమతమవుతోందని, ఈ అంశంపై అప్రమత్తతతో ఉంటూ కాంగ్రెస్ పార్టీని రక్షించుకునే బాధ్యత కార్యకర్తలపైనే ఉందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. నాయకులు సైతం నమ్ముకున్న పార్టీ భవిష్యత్ కోసం పనిచేయాలని సూచించారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ తన అనుచరులతో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా గాంధీభవన్‌లో సభ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బొత్స మాట్లాడుతూ.. సామాన్యుడి అవసరాలను గుర్తించి వాటి పరిష్కారం కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని అన్నారు. అధికారమే ధ్యేయంగా పూటకో మాట, ప్రాంతానికో మాట చెబుతూ చంద్రబాబు చేస్తున్న రాజకీయాలను అందరూ చూస్తున్నారని అన్నారు. మరొక పార్టీ దోచుకుంది దాచుకోవడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేస్తోందని విమర్శించారు. ఎంత కష్టమైనా, నష్టమైనా ఇచ్చిన మాటకు నిలబడి, దానిని అమలు చేసే పార్టీ కాంగ్రెసేనని ఆయన అన్నారు.
 
తెలంగాణ ఇవ్వొద్దని కిరణ్ చెప్పలేదు: సర్వే సత్యనారాయణ
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర విభజన విషయంలో అనుసరిస్తున్న వైఖరి సరైనదేనని సమర్థించారు. విభజనవల్ల తలెత్తే సమస్యలన్నింటినీ పరిష్కరించాకే ముందుకు వెళ్లాలని కిరణ్‌కుమార్‌రెడ్డి అనడం సబబేనని పేర్కొన్నారు.

సీమాంధ్రలో పార్టీని రక్షించుకునే ఉద్దేశంతోనే ఆయన అలా మాట్లాడారని చెప్పారు. ముఖ్యమంత్రి తెలంగాణ ఇవ్వొద్దని చెప్పలేదని, రాష్ట్ర విభజన ప్రక్రియకు ఆయన పూర్తిగా సహకరిస్తారన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జి. ప్రసాద్‌కుమార్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కె. మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు