మరొక్క రోజే... తెలంగాణపై తేల్చేస్తుందని, తుది నిర్ణయం ఖాయమని భావిస్తున్న కాంగ్రెస్ కోర్ కమిటీ కీలక సమావేశానికి ఇంకొక్క రోజే మిగిలింది! ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉత్కంఠ తారస్థాయికి చేరుతోంది. కాంగ్రెస్లోని సమైక్య, వేర్పాటు నేతలు చివరి నిమిషం ప్రయత్నాలకు పదును పెంచారు. వారిలో పలువురు బుధవారం కూడా ఢిల్లీలో దిగ్విజయ్ని కలిసి తమ తమ వాదనలు విన్పించారు. ఇక కిరణ్, బొత్స, దామోదర కూడా శుక్రవారం కోర్ కమిటీకి సమర్పించాల్సిన రోడ్మ్యాప్లకు తుది మెరుగులు దిద్దుతున్నారు. అందులో భాగంగా తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత మంత్రులతో సీఎం కిరణ్ వేర్వేరుగా సమావేశమై అభిప్రాయ సేకరణ జరిపారు. సమైక్యంతో లాభాలు, విభజనతో నష్టాలను రోడ్మ్యాప్లో పొందుపరుస్తానని సీమాంధ్ర మంత్రులకు ఆయన స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. ఢిల్లీని ప్రభావితం చేసేందుకు అవసరమైతే ప్రభుత్వానికి మద్దతు కూడా ఉపసంహరించాలని, ఇందుకోసం గవర్నర్ను కలవాలని సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు యోచిస్తున్నట్టు సమాచారం! ఇక సీమాంధ్ర, తెలంగాణ కాంగ్రెస్ నేతలు బుధవారమంతా సమావేశాలతో రాష్ట్రంలో తలమునకలుగా గడిపారు...