కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు

21 Nov, 2013 03:03 IST|Sakshi

 బీబీనగర్, న్యూస్‌లైన్: ప్రజలు, రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టులను పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని భువనగిరి ఎమ్మెల్యే ఉమామాధవరెడ్డి విమర్శించారు. బుధవారం బీబీనగర్‌లోని సాయి వెంకటరెడ్డి ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన మూడవ విడత రచ్చబండ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జలయజ్ఞం పేరుతో ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నా ఈప్రాంత రైతులకు ఉపయోగపడే బునాదిగాని కాల్వకు నిధులు విడుదల చేయడం లేదన్నారు. ఐదేళ్లుగా నిమ్స్ అసంపూర్తిగా ఉందన్నారు.
 
 నిమ్స్ పూర్తయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పేరు వస్తుందనే నిధులు విడుదల చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే సీసీఎంబీ నిర్మాణం ముందుకు సాగడం లేదన్నారు. గ్రామాల్లో నిర్వహించాల్సిన రచ్చబండ కార్యక్రమాన్ని మండల కేంద్రానికే పరిమితం చేస్తే ప్రజా సమస్యలకు ఎలా పరిష్కారం లభిస్తుందని ప్రశ్నించారు. వర్షాలతో పంటలు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
 

మరిన్ని వార్తలు