వైఎస్సార్‌సీపీలోకి భారీ చేరికలు

31 Jan, 2019 07:24 IST|Sakshi
కాంగ్రెస్‌ నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్న బీవై రామయ్య, కంగాటి శ్రీదేవి, ప్రదీప్‌రెడ్డి

పత్తికొండ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఖాళీ

దాదాపు 500 మంది వైఎస్సార్‌సీపీలో చేరిక

ఆహ్వానించిన బీవై రామయ్య, కంగాటి శ్రీదేవి

కర్నూలు, పత్తికొండ:  పత్తికొండ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. బుధవారం కాంగ్రెస్‌కు చెందిన దాదాపు 500 మంది పార్టీలో చేరారు. పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగడు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్‌రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందు కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్యతో పాటు తుగ్గలి, మద్దికెర, పత్తికొండ మండలాల నుంచి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు వందలాది మంది పత్తికొండకు చేరుకున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ నుంచి ర్యాలీగా బయలుదేరి తేరుబజారు, నాలుగు స్తంభాలు, అంబేడ్కర్‌ సర్కిల్‌ మీదుగావైఎస్సార్‌సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. వీరికిబీవై రామయ్య,కంగాటి శ్రీదేవి, ప్రదీప్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి..సాదరంగా ఆహ్వానించారు.

చంద్రబాబు కాపీరాయుడు
వైఎస్సార్‌సీపీ నవరత్నాలను చంద్రబాబు కాపీ కొట్టడం సిగ్గు చేటని బీవై రామయ్య విమర్శించారు. పరీక్షల్లో కొపీ కొట్టే విద్యార్థులను డీబార్‌ చేసినట్టుగానే ఈసారి ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు డీబార్‌ చేస్తారని హెచ్చరించారు. బ్యాంకర్లతో మీటింగులు పెట్టి రైతులకు రుణాలు ఇవ్వొద్దంటూ చెప్పిన ముఖ్యమంత్రి దేశ చరిత్రలోనే చంద్రబాబు తప్ప మరెవరూ లేరన్నారు. జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. 106 చెరువులకు నీళ్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పి మోసం చేశారన్నారు. జొన్నగిరిలో చంద్రబాబు గంగ పూజ చేసిన తరువాత చెరువులోని నీరు ఇంకిపోయి పూర్తిగా  ఎండిపోయిందన్నారు. నీరు– చెట్టు పేరుతో రూ.కోట్లు దోచుకున్నారని విమర్శించారు. చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి మాట్లాడుతూ చెరుకులపాడు నారాయణరెడ్డిని హత్య చేయించిన నరహంతకులను స్వాగతించే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. కరువులకు నిలయమైన పత్తికొండ నియోజకవర్గంలో ఇంతవరకు ఇచ్చిన హామీలను ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. పత్తికొండలో పాలిటెక్నిక్‌ కళాశాల, జ్యూస్‌ ఫ్యాక్టరీ, పూర్తిస్థాయిలో ఆర్టీసీ డిపో, బాలికలకు వసతిగృహం ఏర్పాటు చేస్తామన్న డిప్యూటీ సీఎం మాట నిలబెట్టుకోలేదన్నారు.

బతుకుదెరువు కోసం దూర ప్రాంతాలకు వలస వెళుతున్న కూలీలను డబ్బు సంపాదించుకోవడానికి పోతున్నారని చంద్రబాబు అనడం నీచమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తమ్మారెడ్డి కుమారుడు ప్రతాప్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్నాథ్‌రెడ్డి, మండల కన్వీనర్లు జూటూరు బజారప్ప, నాగేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రహిమాన్, ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌ నాయక్, సింగిల్‌విండో అధ్యక్షుడు ప్రహ్లాదరెడ్డి, జిల్లా నాయకులు రామచంద్రారెడ్డి, జయ భరత్‌రెడ్డి , హనుమంతు, బనిగాని శ్రీను, మోహన్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు