‘ఖాకీ’ రాసలీలలు గుట్టురట్టు!

21 Jun, 2018 08:50 IST|Sakshi

సాక్షి, కర్నూలు : కోడుమూరు పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ ఓ మహిళతో సాగిస్తున్న రాసలీలలు గుట్టురట్టయ్యాయి. కర్నూలు శివారులోని కోడుమూరు రోడ్డులోని రాజీవ్‌ గృహకల్పలోని మూడవ అంతస్థులో గదిని అద్దెకు తీసుకుని కోడుమూరు పట్టణానికి చెందిన మహిళతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం భర్తకు తెలిసింది. బుధవారం కానిస్టేబుల్‌ ఆన్‌డ్యూటీలోనే ఉంటూ కర్నూలుకు వచ్చి ఫోన్‌ చేసి మహిళను పిలిపించుకుని గదిలో ఉండగా ఇరుగుపొరుగు వారు గదికి తాళం వేసి బంధించి నాల్గవ పట్టణ పోలీసులకు పట్టించారు. కానిస్టేబుల్‌గా పనిచేస్తూ తప్పుడు వ్యవహారానికి పాల్పడటంపై కాలనీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పోలీసు పరువు పోతుందన్న ఉద్దేశంతో కొద్దిసేపు అతనిని స్టేషన్‌లో ఉంచుకుని గుట్టుచప్పుడు కాకుండా వదిలేశారు.  


ప్రేమ జంటను బెదిరించిన కేసులో రౌడీషీట్‌  
కర్నూలు శివారులోని జగన్నాథగట్టు వద్ద ప్రేమ జంటను బెదిరించి బంగారు నగలను లాక్కోవడమే కాక అత్యాచారానికి పాల్పడినట్లు గతంలో ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి. తాలూకా పోలీస్‌స్టేషన్‌లో పనిచేసేటప్పుడు జగన్నాథగట్టు వద్ద ప్రేమ జంటలను బెదిరించడం, డబ్బులు, బంగారు నగలు లాక్కోవడం వంటి నేరాలకు పాల్పడి సస్పెండ్‌కు గురైనట్లు సమాచారం. వ్యభిచారం, మోటర్‌సైకిళ్ల దొంగతనం వంటి పలు నేరాలకు పాల్పడి సస్పెన్షన్‌కు గురికావడమే కాక కొంతకాలం వీఆర్‌లో ఉండి ఏడాది క్రితం కోడుమూరుకు బదిలీపై వెళ్లారు. అక్కడ పనిచేసే ఓ ఏఎస్‌ఐతో కానిస్టేబుల్‌కు విభేదాలు ఉన్నాయి. కోడుమూరు పట్టణానికి చెందిన మహిళతో రాజీవ్‌ గృహకల్పలో ఉన్నట్లు ఏఎస్‌ఐ స్వయంగా భర్తకు సమాచారం ఇచ్చి పట్టించినట్లు పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. అయితే ఎలాంటి కేసు నమోదు చేయకుండా అతనిని పోలీసులు వదిలేయడంపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.      

మరిన్ని వార్తలు