యువతిని మోసగించిన కానిస్టేబుల్ అరెస్టు

19 Aug, 2015 04:36 IST|Sakshi
యువతిని మోసగించిన కానిస్టేబుల్ అరెస్టు

- ఏడు సంవత్సరాలుగా సహజీవనం
- ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్
- మరో యువతిని పెళ్లాడిన నిందితుడు
పటమట :
ప్రేమించానన్నాడు... పెళ్లి చేసుకుందామంటూ సహజీవనం చేశాడు. కొంతకాలం గడిచాక నువ్వు నాకు నచ్చలేదన్నాడు... తనతో ఏకాంతంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు.. చివరికి కటకటాలపాలయ్యాడు. ఇదీ ఓ కానిస్టేబుల్ వ్యవహారం.
 
పోలీసుల కథనం మేరకు.. కృష్ణలంకలోని సత్యనారాయణ నగర్‌లో నివసిస్తున్న ఎ.శ్రీరామ్‌కుమార్(31) మాచవరం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సమయంలో మొగల్‌రాజ పురంలోని ఒక కంటి ఆస్పత్రిలో నర్సుగా పనిచేసే యువతితో చనువు ఏర్పడింది. గతంలోనే ఒక ప్రయివేట్ పాఠశాలలో ఆ యువతికి కానిస్టేబుల్‌తో ముఖపరిచయం ఉంది. ఆ యువతితో మాటలు కలిపి ప్రేమిస్తున్నట్లు నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానంటూ ఆమెతో సహజీవనం ప్రారంభించాడు. తొలుత హెచ్‌బీ కాలనీలో కాపురం పెట్టాటు.

ఆ తరువాత హైదరాబాద్ తీసుకెళ్లి ప్రయివేటు ఆస్పత్రిలో ఉద్యోగంలో చేర్పించాడు. హైదరాబాద్‌లో ఉండగానే ఒకసారి గోవా తీసుకెళ్లాడు. అక్కడ తనతో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆ తరువాత తిరిగి విజయవాడ పటమటలంక లంబాడీపేటకు మకాం మార్చాడు. ఏడేళ్లు సహజీవనం చేసిన తరువాత ‘నువ్వంటే ఇష్టం లేదు, నేను మరొకరిని పెళ్లి చేసుకున్నా’నని ఆ యువతితో చెప్పాడు. ఈ విషయం బయటకు చెబితే గోవాలో తీసిన వీడియోలు నెట్‌లో పెడతానని బ్లాక్‌మెయిల్ చేశాడు.

ఈ నేపథ్యంలో బాధితురాలు జూలై 31వ తేదీన ఫైర్ కంట్రోల్ రూమ్ వద్ద బందరుకాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఫైర్ సిబ్బంది గమనించి ఆమెను రక్షించారు. అనంతరం కానిస్టేబుల్ శ్రీరామ్‌కుమార్ మోసం చేశాడని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి నివసిస్తున్న పరిధి పటమట పోలీస్ స్టేషన్‌లో ఉండటంతో ఆ కేసును పటమట సీఎస్‌కు బదిలీ చేశారు. కేసు విచారణ ప్రారంభించిన సీఐ దామోదర్ నిందితుడు శ్రీరామ్‌కుమార్‌ను అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు