► డీఎస్పీ ఎదుట బెడిసికొట్టిన పంచాయతీ
► మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
పలమనేరు: ప్రేమించి పెళ్ళాడుతానని మాట ఇచ్చిన ఓ కానిస్టేబుల్ మరో మహిళా కానిస్టేబుల్కు అన్యాయం చేసిన సంఘటన శుక్రవారం రాత్రి పలమనేరులో చోటు చేసుకుంది. పలమనేరు మండలం ముసలిమొడుగు చెందిన మోహన్ కానిస్టేబుల్ గత కొన్నాళ్ళుగా కుప్పం పోలీస్స్టేషన్లో పనిచేస్తున్నాడు.
అదే పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్గా కేవీ భార్గవి పనిచేసేది. వీరిద్దరూ గత కొన్నాళ్ళుగా ప్రేమించుకున్నారు. ఈ వ్యవహారం పెళ్ళిదాకా వచ్చింది. ఈ నేపధ్యంలో బార్గవి ప్రవర్తన నచ్చని మోహన్ ఆమె ప్రేమను నిరాకరించాడు. దీంతో ఈ పంచాయతీ స్థానిక డీఎస్పీ శంకర్ చెంతకు చేరింది. ఆయన ఎలాగైనా వీరిని కలుపాలని ప్రయత్నించారు. అయితే మోహన్ ఇందుకు ఒప్పుకోకుండా ఆమె శీలానికి వెలకట్టేందుకు ప్రయత్నించాడు. దీనిపై పోలీసులు సైతం మోహన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు అతడు పెళ్ళికి అంగీకరించకపోవడంతో తన వద్ద ఉన్న నిద్ర మాత్రలను భార్గవి మింగేసింది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిన ఆమెను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరిలించారు. దీనిపై బాధితురాలి పిర్యాదుతో స్థానిక పోలీసులు మోహన్పై కేసును నమోదు చేశారు.