లక్ష్య సాధనకు నిరంతర కృషి 

1 Oct, 2018 04:21 IST|Sakshi

     నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠ

     రాష్ట్ర అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని వెల్లడి

సాక్షి, అమరావతి: విభజన తర్వాత రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నందున ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) పదవిని సమర్థంగా నిర్వహించడం సవాలు వంటిదని అనిల్‌ చంద్ర పునేఠ పేర్కొన్నారు. దినేష్‌ కుమార్‌ నుంచి నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఆదివారం మధ్యాహ్నం 3.45 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పునేఠ మీడియాతో మాట్లాడారు. ‘ఇప్పటికి 34 ఏళ్ల ఉద్యోగ జీవితం పూర్తయి 35వ ఏట సర్వీసులో అడుగుపెట్టాను.

2015 నుంచి ఇప్పటి వరకూ రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్‌గా పనిచేశాను. నా సేవలను గుర్తించి అత్యంత బాధ్యతాయుతమైన సీఎస్‌ పదవి ఇవ్వడం సంతోషంగా ఉంది. నాపై మరింత గురుతర బాధ్యత పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆదాయాన్ని, సంతోష సూచికను పెంచాలి. ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తా. ప్రభుత్వ పథకాల ఫలితాలపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలి. ప్రతిదానిని సమీక్షించి లక్ష్యాలు నిర్దేశించుకుంటాం. టీమ్‌వర్క్‌తో రాష్ట్ర పగతికి పాటుపడతాం’ అని పునేఠ వివరించారు. అన్ని విభాగాల మధ్య సమన్వయంతో ఉత్తమ ఫలితాలు సాధించి తద్వారా రాష్ట్ర ప్రగతికి కృషి చేస్తామన్నారు.
 
తొలిపోస్టింగ్‌లోనే అత్యంత ఆనందం
‘నా ఉద్యోగ జీవితంలో సంతోషం కలిగించిన, ఆనందం మిగిల్చిన పనులు అనేకం ఉన్నాయి. చెప్పాలంటే అన్నీ సంతోషం కలిగించాయి’ అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు పునేఠ జవాబిచ్చారు. అన్నింటికంటే ఎక్కువ ఆనందం, సంతృప్తి కలిగించింది ఏమిటని ప్రశ్నించగా.. ‘వైఎస్సార్‌ జిల్లా రాజంపేటలో సబ్‌ కలెక్టరుగా నేను ఉద్యోగ జీవితం ఆరంభించాను. ఆ తర్వాత పలు జిల్లాల్లో కలెక్టరుగాను, వివిధ శాఖల్లో కార్యదర్శి, ముఖ్యకార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగాను పనిచేశాను.

రాజంపేటలో సబ్‌ కలెక్టరుగా ఉన్నప్పుడు నాకు వచ్చిన వినతుల్లో ఒక్కటి కూడా పెండింగ్‌లో పెట్టకుండా అందరికీ సాధ్యమైన మేలు చేయడం నాకు అత్యంత మరపురాని ఆనందం మిగిల్చింది. ఇంటి స్థలాల కోసం అర్జీలిచ్చిన ప్రతి ఒక్కరికీ ఐదు సెంట్ల స్థలానికి పట్టాలిచ్చాను. వ్యవసాయ భూమి కోసం దరఖాస్తు చేసిన వారికి 3 నుంచి ఐదు ఎకరాల చొప్పున భూమి పట్టాలు ఇచ్చాను’ అని పునేఠ  గుర్తు చేసుకున్నారు.  కాగా, సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించే సమయంలో అనిల్‌ చంద్ర పునేఠ ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరుల పటాన్ని పట్టుకుని చాంబర్‌లోకి ప్రవేశించారు. అనంతరం దినేష్‌ కుమార్‌ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పునేఠను దినేష్‌ కుమార్‌ ఆలింగనం చేసుకుని అభినందించారు. 

మరిన్ని వార్తలు