కరోనా అలర్డ్‌ : దేవాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత

18 Mar, 2020 21:15 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ద్వారకా తిరుమల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి 31 వరకు కేశఖండనశాల, అంతరాలయ దర్శనం, అన్ని ఆర్జిత సేవలు, సుప్రభాత సేవ, అష్టోత్తర పూజలు, ప్రచార రథం నిలుపుదల చేసినట్లు దేవస్థానం ప్రకటించింది. దీంతోపాటు ఆన్‌లైన్‌ ద్వారా టికెట్ల సేవను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. కాగా ఆన్‌లైన్‌ ద్వారా ఇప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులకు పరిస్థితి మెరుగుపడ్డాక స్వామి వారి దర్శనానికి అవకాశం కల్పించనున్నారు. 

విజయవాడ : కరోనా వైరస్‌ నేపథ్యంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి చేయించే ప్రత్యేక పూజలతో పాటు, అంతరాలయ దర్శనం, ఆర్జిత సేవలతో పాటు అన్ని రకాల సేవలను రద్దు చేస్తున్నట్లు దేవస్థాన అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఇంద్రకీలాద్రికి బస్‌ సౌకర్యం నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్‌ 3 వరకు సౌరాష్ట్రక్షరి మహా మంత్ర హవనం, మహా మృత్యుంజయ మంత్ర హవనం, శీతల మహా మంత్ర హవనం, అరుణ పారాయణం, సౌర పారాయణం, సూర్యనామస్కరరాలు, చండీహోమం వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఘాట్ రోడ్డుతో పాటు మహామండపం వద్ద స్క్రీన్ లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు