కరోనా కలవరం

8 May, 2020 09:31 IST|Sakshi
పిఠాపురం కాలనీలో కేసు నమోదైన ప్రాంతం

తూర్పు, దక్షిణలో కేసుల జోరు

అగనంపూడిలో నవవరుడికి పాజిటివ్‌

అప్పన్నపాలెంలో వార్డు వలంటీర్‌కు వ్యాధి లక్షణాలు

ఇద్దరు సచివాలయ ఉద్యోగులు, ఓ ఏఎన్‌ఎం బాధితులు

వ్యాధి గుప్పిట్లో ఇద్దరు పారిశుధ్య కార్మికులు  

ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తం

పరిస్థితి అదుపునకు ఏర్పాట్లు కట్టుదిట్టం

ఓవైపు తీవ్రస్థాయిలో నియంత్రణ చర్యలు తీసుకుంటున్నా కరోనా మహమ్మారి కోర విసురుతోంది. రోజుకో కొత్త ప్రదేశంలో ప్రత్యక్షమై జనాన్ని హడలెత్తిస్తోంది. గురువారం తూర్పు, గాజువాక, పెందుర్తి, దక్షిణ నియోజకవర్గాల్లో వేరువేరు ప్రాంతాల్లో మొత్తం 13 మందికి పాజిటివ్‌ రావడంతో ఆయా ప్రాంతాల్లో కలకలం చెలరేగింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 54కు చేరింది. పరిస్థితి చేజారకుండా అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ కఠిన నియంత్రణ చర్యలకు ఉపక్రమించింది. ఆంక్షలు అమలు చేస్తూ, పారిశుధ్య పరిరక్షణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది.  

మద్దిలపాలెం (విశాఖ తూర్పు): ఇన్నాళ్లూ కరోనా జాడ కానరాని తూర్పు నియోజకవర్గంలో గురువారం ఆ మహమ్మారి ఒక్కసారిగా బుసకొట్టింది. నియోజకవర్గంలో ఒకేరోజు వరస కేసులు నమోదుకావడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. బాధితుల్లో ఒకరు సచివాలయ ఉద్యోగి ఉండడంతో కలవరం మరింత పెరిగింది. పిఠాపురం కాలనీకి చెందిన వార్డు వలంటీర్‌కు కరోనా సోకింది. కేఆర్‌ఎం కాలనీ, సింహాద్రిపురం కాలనీ, చినవాల్తేరు ప్రాంతాల్లో కరోనా జాడ కనిపించడంతో ఆయా ప్రాంతాల్లో అధికార యంత్రాంగం నియంత్రణ చర్యలకు ఉపక్రమించింది. 22వ వార్డులోని పిఠాపురం కాలనీలో కళాభారతి వెనుక ఓ ఇంట్లో నివాసముంటున్న సచివాలయ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో పిఠాపురం కాలనీ కంటైన్‌మెంట్, రెడ్‌జోన్‌గా ప్రకటించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఈ ప్రాంతంలో మార్కెట్లు, దుకాణాలు మూసివేశారు. 16వ వార్డులోని కేఆర్‌ఎంకాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న 45 ఏళ్ల వ్యక్తి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇతడు వారం క్రితం వార్డు కార్యాలయంలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. 15వవార్డులో గల సింహద్రిపురంలో నివాసముంటున్న 55 ఏళ్ల వ్యక్తి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ వ్యక్తి 16వవార్డులో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. చినవాల్తేరు రెల్లివీధికి చెందిన ఇద్దరు జీవీఎంసీ పారిశుధ్య కార్మికులకు, జాలారిపేటకు చెందిన చేపల విక్రేతకు కూడా పాజిటివ్‌ వచ్చింది.

నెల క్రితం వివాహం.. ఇప్పుడు పాజిటివ్‌
అగనంపూడి (గాజువాక): వడ్లపూడి లక్ష్మిపురం కాలనీకి చెందిన 29 ఏళ్ల యువకునికి జరిపిన వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అతడిని గీతం ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఆరుగురు కుటుంబ సభ్యులను కూడా గీతంలో క్వారంటైన్‌ చేశారు. ఈ యువకుడు మార్చి 20న కువైట్‌ నుంచి ముంబై మీదుగా విశాఖకు చేరుకుని పరీక్ష చేయించుకున్నాడు. నెగెటివ్‌ రిపోర్ట్‌ రావడంతో హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నాడు. తరువాత పరీక్షల్లో కూడా నెగిటివ్‌ రావడంతో గతనెల 8న పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు పరీక్షల్లో పాజిటివ్‌ రావడంతో.. స్థానికులు భీతిల్లుతున్నా రు. శ్రీహరిపురంలో గురు వారం ఓకేసు నమోదైంది.

వలంటీర్‌కు పాజిటివ్‌
సింహాచలం/సబ్బవరం (పెందుర్తి): 98వ వార్డు పరిధిలోని వేపగుంట ప్రాంతంలోగల అప్పన్నపాలెంలో నివాసం ఉంటున్న వార్డు వాలంటీర్‌ కరోనా బారిన పడ్డాడు. వలంటీర్లకు ఇటీవల జరిపిన పరీక్షల్లో అతనికి పాజిటివ్‌ వచ్చినట్టు గురువారం వెల్లడైంది. దీంతో అ తడిని గీతం ఆస్పత్రికి  తరలించారు. కుటుంబసభ్యులు, స్నేహితులు  22 మందిని తీసుకువెళ్లారు. అతడు సబ్బవరం మండలం రాయపుర అగ్రహారంలో కుటుంబాన్ని చూసేందుకు రావడంతో అక్కడివారి వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. వేపగుంటలోని అప్పలనర్సయ్య కాలనీలో ఓ యువకుడికీ పాజిటివ్‌ వచ్చింది.

ఏఎన్‌ఎంకు పాజిటివ్‌
డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ): దండుబజార్‌ పరిసర ప్రాంతాల్లో కరోనా జాడ కనిపిస్తూనే ఉంది. గురువారం ఈ ప్రాంతంతో ఓ ఏఎన్‌ఎంకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. శ్రీనగర్‌ (రామా టాకీస్‌) ప్రాంతంలో సచివాలయ ఉద్యోగి అయిన యువకుడికి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. జాలరిపేటలో ఓ కేసు నమోదైంది.

మరిన్ని వార్తలు