లాక్‌డౌన్‌ మరింత కఠినం 

16 Apr, 2020 07:45 IST|Sakshi
మాట్లాడుతున్న జిల్లా ప్రత్యేక అధికారి కె.విజయానంద్, చిత్రంలో కలెక్టర్‌ గంధం చంద్రుడు 

కోవిడ్‌–19 జిల్లా ప్రత్యేక అధికారి కె.విజయానంద్‌ 

సాక్షి, అనంతపురం: కరోనా వైరస్‌ కట్టడికి జిల్లాలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించామని, ఈ మేరకు పోలీసు శాఖకు ఆదేశాలిచ్చామని కోవిడ్‌–19 జిల్లా ప్రత్యేక అధికారి కె.విజయానంద్‌ తెలిపారు. బుధవారం ఆయన కలెక్టర్‌ గంధం చంద్రుడుతో కలిసి కలెక్టరేట్‌లేని రెవెన్యూ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. అనంతపురం, హిందూపురంలో రెడ్‌జోన్‌లు ఏర్పాటు చేసి, ప్రతి రెడ్‌జోన్‌లో ఒక సబ్‌కంట్రోల్‌ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలకు  సరుకులు, పాలు, నిత్యావసరాలు అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. పర్యవేక్షణకు రెడ్‌జోన్‌కు ఒక నోడల్‌ అధికారిని నియమించామన్నారు. ఇక కరోనా లక్షణాలున్నవారి నుంచి సేకరించిన శాంపిల్స్‌ టెస్టింగ్‌ ప్రక్రియ వేగవంతం చేశామన్నారు. (క్వారంటైన్‌ నుంచి వెళ్లేటప్పుడు పేదలకు రూ 2,000 సాయం)

ఇప్పటి వరకు సేకరించిన నమూనాల్లో 80 శాతం ఫలితాలు వచ్చాయన్నారు.  ఇంకా 350 శాంపిల్స్‌ టెస్టింగ్‌ చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన కోవిడ్‌ ఆస్పత్రుల్లో 1,000 పడకలు సిద్ధంగా ఉంచామన్నారు. కలెక్టర్‌ గంధం చంద్రుడు మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి వ్యక్తికి మూడు మాస్క్‌లు ఇస్తామన్నారు. ఇందుకు జిల్లాకు 1.30 కోట్ల మాస్కులు తెప్పిస్తున్నామన్నారు. అంతకుముందు ఆయన కరోనా బారిన పడిన వారి కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ అంశంపై రెవెన్యూ, పోలీసు  అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పాజిటివ్‌ కేసు నమోదు కాగానే వెంటనే కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ ప్రక్రియ చేయాలన్నారు. పాజిటివ్‌ వ్యక్తులు ఏ ప్రాంతాల్లో సంచరించారు...? ఎవరెవరిని కలిశారు..? తదితర వివరాలతో పాటు వారి పేరు, ఫోన్‌ నంబర్, ఆధార్‌ నంబర్, తదితర వివరాలతో ప్రొఫార్మా రూపొందించి పంపాలన్నారు.

ప్రైవేటు వైద్యుల భాగస్వామ్యం తప్పనిసరి 

అనంతపురం అర్బన్‌: కరోనా కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రైవేటు వైద్యులు భాగస్వాములు కావాలని కోవిడ్‌–19 జిల్లా ప్రత్యేక అధికారి కె.విజయానంద్‌ ప్రైవేటు వైద్యులకు సూచించారు. బుధవారం ఆయన కలెక్టర్‌ గంధం చంద్రుడు, జేసీ డిల్లీరావుతో కలిసి కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ప్రైవేటు వైద్యులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎంపిక చేసిన ఆరు కోవిడ్‌ ఆస్పత్రుల్లో స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు ప్రైవేటు వైద్యులు ముందుకు వచ్చి గురువారం నుంచి విధులకు హాజరుకావాలన్నారు.

పారా మెడికల్‌ సిబ్బంది కూడా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ పద్మావతికి సూచించారు. ప్రైవేటు వైద్యులకు అన్ని రకాల సదుపాయాలు కలి్పస్తామన్నారు. కలెక్టర్‌ చంద్రుడు మాట్లాడుతూ, ప్రైవేటు వైద్యులు రోజూ మూడు షిఫ్ట్‌ల ప్రకారం సేవలందించాలని సూచించారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ జాహ్నవి, డీఎఫ్‌ఓ జగన్నాథ్‌సింగ్, అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ పద్మావతి, ఐఎంఏ కోవిడ్‌ కో–ఆర్డినేటర్‌ మనోరంజన్‌ పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు