చదువులపై ‘కరోనా’ దరువు

22 Apr, 2020 02:35 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా చదువులకు ఆటంకం కలిగే పిల్లల సంఖ్య 158కోట్లు

విద్యాసంస్థలు మూతపడే దేశాల సంఖ్య 191

దేశంలో 32.07 కోట్ల మందిపై ప్రభావం ఆన్‌లైన్‌ బోధనతో కొంత నష్ట నివారణ: యునెస్కో

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ ప్రపంచ విద్యా రంగంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటివరకు 191 దేశాల్లో విద్యాసంస్థలు మూతపడగా.. 158 కోట్ల మంది విద్యార్థుల చదువులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలు ఇలా అన్ని సంస్థల్లోని బోధన నిలిచిపోయింది. విద్యారంగంలో నెలకొన్న ప్రస్తుత పరిణామాలపై యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (యునెస్కో) అధ్యయనం చేస్తూ నివేదికలను విడుదల చేస్తోంది. చదవండి: విదేశీ విద్యపై తగ్గని మోజు!

ఫిబ్రవరి 8 తరువాత మొదలై..
కరోనా వైరస్‌ ప్రపంచమంతటా వ్యాప్తి చెందేదిగా మారుతోందన్న ప్రకటన వెలువడగానే అనేక దేశాలు ఫిబ్రవరి 8వ తేదీ తరువాత మొదటగా విద్యాసంస్థలను మూసివేస్తూ వచ్చాయి.

► ఈ పరిస్థితిని యునెస్కో మూడు రకాలుగా పరిగణనలోకి తీసుకుంది. అమెరికా వంటి దేశాల్లో చాలా రాష్ట్రాలు విద్యా సంవత్సరం చివరి వరకు స్కూళ్ల మూసివేతను తప్పనిసరి చేశాయి. 

► కొన్ని రాష్ట్రాలు స్కూళ్లను మూతవేయాలని సూచించాయే గానీ.. తప్పనిసరి చేయలేదు. 

►రష్యా, గ్రీన్‌ల్యాండ్, ఆస్ట్రేలియా, జపాన్‌ వంటి దేశాల్లో స్థానిక పరిస్థితులను అనుసరించి స్కూళ్లను నడిపించే వెసులుబాటు కల్పించారు.

► తుర్కిస్తాన్, బెలారస్‌ దేశాల్లో మాత్రమే స్కూళ్లు పూర్తిస్థాయిలో నడుస్తున్నట్లు యునెస్కో వెల్లడించింది.

► ఏప్రిల్‌ 21వ తేదీ వరకు విద్యాసంస్థల మూతతో ప్రపంచ వ్యాప్తంగా 157 కోట్ల 96 లక్షల 34 వేల 506 మంది విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. 

► మొత్తం ప్రపంచంలోని విద్యార్థుల సంఖ్యలో ఇది 91 శాతం. అయితే, భారత్‌లోని జమ్మూ కశ్మీర్, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకు సంబంధించిన గణాంకాలను యునెస్కో తన నివేదికల్లో పేర్కొనలేదు.

► భారత్‌లో అన్ని విద్యాసంస్థలు మూతపడటంతో విద్యార్థులంతా ఇళ్ల వద్దే ఉంటున్నారు. వీరందరికీ విద్యా సంవత్సరం చివరి రోజులే.

► కొన్నిచోట్ల కొన్ని పరీక్షలు జరగ్గా.. మరికొన్ని చోట్ల మధ్యలో నిలిచిపోవడంతో విద్యార్థులు ఇళ్ల వద్దే ఉంటూ ఆన్‌లైన్, డిజిటల్‌ వేదికల ద్వారా పాఠాలు నేర్చుకునేలా ప్రభుత్వాలు, విద్యాసంస్థలు నష్ట నివారణ చర్యలు చేపట్టాయి.

మరిన్ని వార్తలు