కరోనా ఎఫెక్ట్‌తో డేటాకు భారీ డిమాండ్‌ 

23 Mar, 2020 05:13 IST|Sakshi

సాక్షి, అమరావతి:  కరోనా (కోవిడ్‌–19) వైరస్‌ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఇంటర్నెట్‌ వినియోగం భారీగా పెరిగింది. గడచిన నాలుగు రోజుల నుంచి ఇంటర్నెట్‌ డేటా వినియోగంలో 20 నుంచి 25 శాతం వృద్ధి కనిపిస్తోందని, ఇది రానున్న కాలంలో మరింత పెరుగుతుందని టెలికాం, ఇంటర్నెట్‌ సర్వీసు ప్రొవైడర్లు పేర్కొన్నారు.  

- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో కలిపి రిలయన్స్‌ జియో చందాదారులు సగటున రోజూ 5,000 టెట్రాబైట్స్‌ డేటాను వినియోగిస్తుంటే అది ఇప్పుడు 6,000 టెట్రాబైట్స్‌కు పెరిగింది.  
- గతంలో రిలయన్స్‌ జియో చందాదారుడు నెలకు సగటున 11 నుంచి 15 జీబీ డేటాను వినియోగించే వారు. ఇప్పుడది మరో 25 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా.  
- కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తో పెద్దసంఖ్యలో ఉద్యోగులు, వ్యాపారులు ఇంటి నుంచే పని చేసేందుకు మొగ్గుచూపుతుండటంతో డేటాకు అనూహ్యంగా డిమాండ్‌ పెరిగింది.  
- బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాల్లో చాలా కంపెనీల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ప్రకటించడంతో ఒక్కసారిగా వ్యక్తిగత డేటా వినియోగంలో డిమాండ్‌ పెరిగింది. ఈ రెండు నగరాల నుంచి చాలా మంది రాష్ట్రంలోని సొంత ఊర్లకు వచ్చి ఇక్కడి నుంచే పనిచేస్తున్నారు.  
- పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా పూర్తి సమర్థతతో ఉన్నామని, ట్రాఫిక్‌ ఇంకా పెరిగినా నెట్‌వర్క్‌లు స్తంభించే అవకాశం లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ప్రొవైడర్లు స్పష్టం చేస్తున్నారు.  
- రిలయన్స్, ఎయిర్‌టెల్‌ వంటి సంస్థలు డిమాండ్‌కు అనుగుణంగా సరికొత్త టాప్‌అప్‌ పథకాలను ప్రవేశపెడుతున్నాయి.  
- వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పుణ్యమా అని ఒక్కసారిగా ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, డాంగిల్స్‌కు డిమాండ్‌ పెరిగింది.  

మరిన్ని వార్తలు