తైవాన్‌ వ్యక్తికి కోవిడ్‌ లక్షణాలు!

1 Mar, 2020 11:31 IST|Sakshi
చెన్‌తో మాట్లాడుతున్న నోడల్‌ అధికారి

తిరుపతి రుయాలో చేర్పించిన అధికారులు

కరోనా వైరస్ వార్తలతో చిత్తూరు జిల్లా వాసుల ఆందోళన

సాక్షి,చిత్తూరు :  తిరుపతి రుయా ఆస్పత్రిలో కోవిడ్‌–19 వైరస్‌ అనుమానితుడికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. తైవాన్‌కు చెందిన చెన్‌ షి షున్‌(35)ను రుయాలోని ప్రత్యేక వార్డులో చేర్పించారు. ఈ నెల 17న అతడు తైవాన్‌ నుంచి పలు యంత్రాలను అమరరాజ గ్రూప్స్‌కు తీసుకు వచ్చి, వాటిని అమర్చే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో అతడికి రెండు రోజులుగా జలుబు, దగ్గరు తీవ్రతరం అయ్యాయి. వాటిని కోవిడ్‌ లక్షణాలుగా భావించిన శనివారం రుయాకు తీసుకొచ్చారు. ప్రస్తుతానికి అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నా... రక్త నమునాలను పరీక్షల నిమిత్తం పుణెకు పంపాలని వైద్యులు భావిస్తున్నారు. (అమెరికాలో తొలి కోవిడ్-19 మృతి)

వాటి ఫలితాలు వచ్చేవరకూ అతడిని జిల్లా వైద్యారోగ్యశాఖ పర్యవేక్షణలో ఉంచాలని భావిస్తున్నట్లు రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎన్‌వీ రమణయ్య, జిల్లా నోడల్‌ అధికారి డాక్టర్‌ సుబ్బారావు, ఆర్‌ఎంవో డాక్టర్‌ హరికృష్ణ తెలిపారు. కాగా కరోనా వైరస్‌తో ఓ వ్యక్తి రుయాలో చేరినట్లు వార్తలతో జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని.... తైవాన్‌ వ్యక్తి ఆరోగ్యం బాగుందని వైద్యులు తెలిపారు. (ప్రపంచంపై పిడుగు )


 

మరిన్ని వార్తలు