కరోనా: ఏపీలో మరో 19 పాజిటివ్‌ కేసులు..

13 Apr, 2020 20:28 IST|Sakshi

ఒక్క గుంటూరు జిల్లాలోనే 11 కేసులు నమోదు

దీంతో ఆ జిల్లాలో 93కి చేరిన కేసులు

రాష్ట్రవ్యాప్తంగా 866 శాంపిల్స్‌లో 847 నెగెటివ్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం మరో 19 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 439 కి చేరింది. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 866 శాంపిల్స్‌ను పరిశీలించగా అందులో 847 కేసుల్లో నెగెటివ్‌ రాగా 19 కేసుల్లో పాజిటివ్‌ వచ్చిందని ఏపీ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈమేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసుల్లో 11 కేసులు ఒక్క గుంటూరు జిల్లాలోనే నమోదు కావడంతో ఆ జిల్లాలో కోవిడ్‌ కేసుల సంఖ్య 93కి చేరింది. 
(చదవండి: లాక్‌డౌన్‌ అమలులో ఏపీ నెంబర్‌ వన్‌)

సోమవారం నమోదైన కేసుల్లో గుంటూరు జిల్లాలో అత్యధికంగా 11 ఉండగా, నెల్లూరులో 4, చిత్తూరులో 2, కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకొక్కటి చొప్పున నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8755 శాంపిల్స్‌ పరిశీలించగా 8,316 ​కేసుల్లో నెగెటివ్‌ వచ్చింది. 439 కేసులు పాజిటివ్‌గా నమోదయ్యాయి. కోవిడ్‌ బారినపడి 12 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కాగా.. ఏడుగురు  మరణించారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో చికిత్స పొందుతున్న  కోవిడ్‌ యాక్టివ్‌ కేసుల సంఖ్య 420గా ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటనలో తెలిపింది.

(చదవండి: కరోనా: అత్యవసర ప్రయాణాలకు ఏపీలో పాసులు)

మరిన్ని వార్తలు