ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్
ఆలోపు నిత్యావసరాలు కొనుగోలు చేయాలి
సాక్షి, అమరావతి: కరోనా విస్తరణ నివారణ చర్యల్లో భాగంగా పట్టణాలు, నగరాల్లో నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 11 గంటల వరకే అనుమతిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) తెలిపారు. ఆదివారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఒక్కసారిగా బయటకు రావద్దు
- నిపుణుల సూచనల మేరకు నిత్యావసరాల విక్రయాల సమయం కుదించాం. ఉదయం 11 గంటల తర్వాత పట్టణాలు, నగరాల్లో ప్రజలు బయటకు రాకూడదు. గ్రామాల్లో మాత్రం మధ్యాహ్నం 1 గంట వరకు అనుమతిస్తున్నాం. ప్రజలు ఒక్కసారిగా బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలి.
- నిత్యావసరాలకు కొరత లేకుండా చర్యలు చేపట్టాం. నిత్యావసర సరుకులు సహా ఏ సమస్య ఉన్నా ప్రజలు 1902 నంబర్కు ఫిర్యాదు చేయవచ్చు.
- అనాథలు, ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి భోజన సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
- ప్రతి జిల్లాలో మంత్రులు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటారు. పట్టణ ప్రాంతాల పర్యవేక్షణకు సీనియర్ అధికారులను నియమించాలని సీఎం ఆదేశించారు.
- లాక్డౌన్కు ప్రజలు ఎంతో సహకరిస్తున్నారు. ఇకపై కూడా ఇదే విధంగా సహకరించాలి
- రాష్ట్రానికి అత్యవసరంగా వచ్చేవారిని క్వారంటైన్లో ఉంచుతాం. మరోసారి రీ సర్వే చేసి విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్కు తరలించాలని సీఎం ఆదేశించారు.
పొలం పనులకు ఇబ్బంది లేదు..
- రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాగవు తున్న చేపలు, రొయ్యలను ఎంపెడాతో కలసి కొనుగోలు చేయడంపై నిరంతరం పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు
- వ్యవసాయ కూలీల రాకపోకలను అడ్డుకోవద్దని సీఎం స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోకుండా చర్యలు తీసుకోవాలని, మొబైల్ మార్కెట్లు పెంచాలని సీఎం సూచించారు.
– వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు
104కి ఫోన్ చేయండి
- ఎవరైనా జ్వరం, పొడిదగ్గు, గాలి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదు ర్కొంటే వెంటనే 104 నంబర్కు తెలియజేయాలి. వలంటీర్లకు సమాచారం ఇవ్వాలి.
- కరోనా విస్తరించకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రజలు సామాజిక దూరం పాటించడంతోపాటు ఇళ్లలోనూ వ్యక్తిగత దూరం, పరిశుభ్రత పాటించాలి.
– పీవీ రమేష్ (సీఎంవో అదనపు చీఫ్ సెక్రటరీ)