కరోనా: ‘అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అప్రమత్తంగా ఉంది’

7 Apr, 2020 16:12 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: కరోనా నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా అప్రమత్తంగా ఉందని సీఎంవో అదనపు ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీవీ రమేశ్‌ అన్నారు. కోవిడ్‌-19 అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నిన్నరాత్రి నుంచి కేవలం ఒక్క పాజిటివ్ కేసు మాత్రమే నమోదు అయింది. దీన్ని బట్టి కేసుల పెరుగుదల చివరి దశకు వచ్చిందని భావించవచ్చు. అలాగని నిర్లక్ష్యం వద్దు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉంది. ల్యాబ్‌ టెస్టుల సౌకర్యం మరింత పెంచేందుకు పుణె నుంచి మరిన్ని కిట్లు తెప్పిస్తున్నాం.

విదేశీ యూనివర్సిటీలతో కూడా అక్కడక్కడ కొన్ని టెస్టులు చేయిస్తున్నాం. రాష్ట్రంలో ఇప్పటివరకు 43,000 ఐసోలేషన్ బెడ్లు ఏర్పాటు చేశాం. వివిధ దశల్లో ఎప్పటికప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షిస్తున్నారు. కోవిడ్-19 ను ఆరోగ్యశ్రీ కిందకు కూడా తీసుకువచ్చాం. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనాకు వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాం. వీటికి తోడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని వసతులు ఏర్పాటు చేశాం. ఇకపై కేసుల్లో క్రమేణా తగ్గుదల కనిపించవచ్చని నిపుణులు చెప్తున్నారు’ అని రమేశ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు