జిల్లా వ్యాప్తంగా 272 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు
11.60 లక్షల టన్నుల సేకరణే లక్ష్యం
జిల్లాలో 1,64,882 హెక్టార్లలో రబీ సాగు
14.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా
ఏ గ్రేడ్ ధాన్యానికి మద్దతు ధర కింటాల్కు రూ.1835
సాధారణ రకం రూ.1815గా నిర్ణయం
సాక్షి, కాకినాడ: జిల్లాలో ధాన్యం సేకరణకు అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 272 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల రెండో వారం నుంచి కొనుగోలుకు చేయనున్నట్లు జేసీ ప్రకటించారు. ప్రస్తుతం జిల్లాలో లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో వ్యవసాయ పనులకు వెసులుబాటు కలి్పంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించడంతో కేంద్రాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది రబీలో 1,64,882 హెక్టార్లు పంట సాగైంది. 14.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది 14.10 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి రాగా.. ఈ ఏడాది సకాలంలో పంటలకు ప్రభుత్వం నీరు అందించడంతో 40 వేల మెట్రిక్ టన్నులు అదనంగా దిగుబడి అందే అవకాశం ఉందని భావిస్తున్నారు.ఎకరానికి 40 నుంచి 45, 50 బస్తాల వరకు దిగుబడి అందుతుందన్న ఆశాభావం రైతుల నుంచి వ్యక్త మవుతోంది.
రవాణాకు అవరోధం లేకుండా చూస్తాం
ధాన్యం సేకరణకు సన్నద్ధం అవుతున్నాం. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే సింహభాగం పూర్తి చేశాం. ఈ నెల రెండో వారంలో ప్రక్రియ ప్రారంభిస్తాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదన్నది ప్రభుత్వ నిర్ణయం. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటాం. ధాన్యం రవాణాలో ఎటువంటి అవరోధం లేకుండా చూస్తాం. వ్యవసాయ పనులు యథావిధిగా జరుపుకునేలా చూస్తున్నాం. అయితే పొలాల్లో సైతం సామాజిక దూరం పాటించాల్సి ఉంది. – డాక్టర్ జి.లక్ష్మీశ, జేసీ