ఢిల్లీ వెళ్లొచ్చిందెవరు? 

30 Mar, 2020 03:57 IST|Sakshi

ఆరా తీస్తున్న యంత్రాంగం

రాష్ట్రమంతా టాస్క్‌ఫోర్స్‌ బృందాల ఏర్పాటు

సాక్షి, నెట్‌వర్క్‌ : ప్రార్థనల కోసం ఇటీవల ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి తిరిగొచ్చిన వారెవరనే దానిపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రం నుంచి చాలామంది ప్రార్థనల నిమిత్తం ఢిల్లీ వెళ్లారు. అలాంటి వారు ఎంతమంది ఉంటారనేది అంచనాకు అందటం లేదు. ఈ నేపథ్యంలో వారిని గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఏర్పాటయ్యాయి. అక్కడి నుంచి తిరిగొచ్చాక వారు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరిని కలిశారనే దానిపైనా దృష్టి సారించారు. ఇలాంటి వ్యక్తులు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా ఉన్నట్లు ప్రాథమికంగా తేలటంతో ఆ రెండు జిల్లాల అధికారులు అప్రమత్తమై వారిని గుర్తించే పనిలో నిమగ్నమై ఎక్కడికక్కడ జల్లెడ పడుతున్నారు. 

చీరాల ప్రాంతం నుంచే 280 మంది..
- ఢిల్లీ వెళ్లిన గుంటూరు వ్యక్తుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు ఇప్పటికే నిర్ధారణ కావడంతో.. వారితో తిరిగిన 128 మందిని, చీరాలకు చెందిన పాజిటివ్‌ వ్యక్తుల్ని కలిసిన సుమారు 35 మందిని ఇప్పటికే గుర్తించారు.
- మరోవైపు ఢిల్లీ వెళ్లిన వారి రైల్వే రిజర్వేషన్‌ వివరాలను బట్టి వారి చిరునామాలు వెతుకుతున్నారు. 
- చీరాలకు చెందిన మతపెద్ద దంపతులకు కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు నిర్థారణ కాగా.. ఆయనతో కలిసి ఢిల్లీ ప్రార్థనలకు సుమారు 280 మంది వెళ్లినట్లు గుర్తించారు. వారిలో 200 మంది ఒంగోలు రైల్వేస్టేషన్‌లో దిగినట్లు గుర్తించి.. ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
- ఆదివారం రాత్రి వరకు చీరాల పరిసర ప్రాంతాలతో పాటు కనిగిరి, కందుకూరు, గిద్దలూరు, ఒంగోలు నగరంలో సుమారు 105 మందిని గుర్తించి.. కొందరిని హోం క్వారంటైన్, మరికొందరిని ఆస్పత్రి క్వారంటైన్, ఐసోలేషన్‌ వార్డులకు తరలించారు. 
- గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి చెందిన 15 మంది ఢిల్లీ వెళ్లి ఈ నెల 19న స్వస్థలాలకు చేరుకున్నట్లు గుర్తించారు.
- వీరిలో ఇద్దరు కారంపూడి వాసులు కాగా.. పట్టణంలోని తూర్పు బావి ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు ఉన్నారు. 
- వీరిలో ఇద్దరు యువకులు ఇటీవల గుంటూరులో విందుకు హాజరై కరోనా బారినపడ్డారు. ఆ యువకుల కుటుంబ సభ్యులతోపాటు వారిని కలిసిన 32 మందిని అంబులెన్స్‌లలో కాటూరు వైద్యశాలకు తరలించారు.
- కనిగిరిలో కజికిస్తాన్‌ నుంచి వచ్చిన ఓ వైద్యుడు క్వారంటైన్‌లోకి వెళ్లకుండా ప్రజలకు వైద్య సేవలందిస్తున్నట్లు తేలడంతో అతనిపై కేసు నమోదు చేసి క్వారంటైన్‌కు తరలించారు. 
- అతడి వద్ద వైద్యసేవలు పొందిన 150 మంది రోగులను సైతం గుర్తించి క్వారంటైన్‌కు తరలించే ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు