-
లాక్ డౌన్ నేపథ్యంలో జిల్లాలో ఆంక్షలు
నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మాత్రమే అనుమతి
తెలంగాణ నుంచి వచ్చే మార్గాల్లో 52 చెక్ పోస్టులు
గుంటూరు, పశి్చమగోదావరి నుంచి వచ్చే వాహనాల నియంత్రణ
రోడ్లపైకి వచ్చే వారు సరైన కారణం చూపకపోతే కేసులు
వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా బంద్
అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారుల హితవు
జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్.. జిల్లా ప్రజానీకం ఎప్పుడూ వినని సరికొత్త పదాలను వింటోంది. ఎండాకాలం ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ఉంటుంటే.. సమాజంలో కరోనా వైరస్పై ఆందోళన కూడా అదే స్థాయిలో వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో మాయదారి వైరస్ బారి నుంచి జిల్లాను తప్పించేందుకు యంత్రాంగం శతవిధాలా ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ను పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేస్తోంది. అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసి వేసి.. వాహనాలు, ప్రజలు బయటకు రాకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తోంది. మరోవైపు ప్రజల నిత్యావసరాలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రజలు కూడా స్వీయ నిర్బంధం పాటించి తమని తాము వైరస్ బారిన పడకుండా కాపాడుకోవాలని అధికారులు కోరుతున్నారు.
గడప దాటొద్దు
లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ హెచ్చరించారు. జిల్లాలో 144 సెక్షన్ను అమలు చేస్తున్నామని చెప్పారు. నిర్ణయించిన సమయాల్లో తప్ప ఇళ్లను వదిలి బయటకు రావద్దని సూచించారు.
ప్రతిక్షణం అప్రమత్తం
జిల్లాలో ఇప్పటి వరకు 1,199 మంది విదేశాల నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ప్రతి ప్రది మందికీ ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించి, వారి ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నారు. వలంటీర్లు ఇంటింటికీ తిరిగి ఇటీవల విదేశాల నుంచి వచ్చిన
వారిని గుర్తిస్తున్నారు.
సాక్షి, మచిలీపట్నం: కరోనా కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ను జిల్లాలో పగడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం నడుంబిగించింది. లాక్డౌన్ను ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసేందుకు సన్నద్ధమవుతోంది. తొలుత అంతరాష్ట్ర సరిహద్దులను స్తంభింపజేయడమే కాక.. పొరుగు జిల్లాలైన పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల నుంచి రాకపోకలపై నిఘా పెట్టారు. ఇప్పటికే తెలంగాణ నుంచి జిల్లాకు వచ్చే మార్గాల్లో 52 చెక్పోస్టులు 24 గంటలూ పనిచేస్తున్నాయి. తాజాగా గుంటూరు, పశి్చమ గోదావరి జిల్లాలకు దారితీసే మార్గాల్లో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు.