కరోనా: ఏపీలో పెరుగుతున్న రికవరీ రేటు

6 May, 2020 13:13 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకిన వారు వేగంగా కోలుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్‌ రికవరీ రేటు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 140 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనాను జయించిన వారు వాళ్ల సొంత ఇళ్లకు వెళుతున్నారు. జిల్లాలవారిగా పరిశీలిస్తే.. కృష్ణాలో 61, కర్నూలులో 39, చిత్తూరులో 20, అనంతపురంలో 10, తూర్పుగోదావరిలో 4, ప్రకాశం, పశ్చిమ గోదావరిజిల్లాలో ఇద్దరు, వైఎస్సార్‌ కడప, గుంటూరులో ఒక్కొక్కరు డిశ్చార్జ్‌ అయ్యారు.(ఏపీలో కొత్తగా 60 కరోనా కేసులు..)

ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో 729 మంది కరోనా చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ అయ్యారు. దేశ సగటు కంటే అధికంగా డిశ్చార్జ్ రేటు ఏపీలో నమోదు అవుతోంది. గత 24 గంటల్లో 7,782 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో 60 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గుజరాత్ నుంచి వచ్చిన 12 మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. కరోనా వైరస్‌ నిర్దారణ పరీక్షలు చేయటంలో ఏపీ.. దేశంలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు లక్షా 41వేల 274 మందికి పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు