అమ్మవారి గుడిలో మార్చి 31 వరకు సేవలు నిలిపివేత

19 Mar, 2020 16:22 IST|Sakshi

సాక్షి, విజయవాడ: కరోనా వైరస్‌ విజృంభిస్తున్నందున దుర్గ గుడిలో మార్చి 31 వరకు అన్ని సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ చైర్మన్‌ పైలా సోమినాయుడు పేర్కొన్నారు. అమ్మవారి అంతరాలయ దర్శనాలను రద్దు చేశామన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో అన్ని ఆర్జిత సేవలను నిలిపేసినట్లు వెల్లడించారు. కేశ ఖండనశాలను, అమ్మవారి గుడి దగ్గరకు వెళ్లే బస్సులను, లిఫ్టులను నిలిపివేశామన్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు శానిటైజేషన్‌ లిక్విడ్‌ అందజేస్తున్నామని తెలిపారు. భక్తులందరికీ వైద్యపరీక్షలు చేసిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాక దేశ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని హోమాలు జరిపిస్తున్నామన్నారు. (హమ్మయ్యా.. మనోళ్లు వచ్చేశారు)

దుర్గాగుడి ఆలయ ఈవో సురేష్‌ బాబు మాట్లాడుతూ.. ఉగాది రోజు పంచాగశ్రవణం ఉంటుందని, కానీ అమ్మవారి సేవలకు భక్తులకు అనుమతి లేదన్నారు. అమ్మవారికి జరిగే సేవలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. భక్తులు ఎవరైనా ముందుగా సేవలను బుక్‌ చేసుకుని ఉంటే వారిపేరున సేవలు నిర్వహిస్తామన్నారు. లేదు, డబ్బు తిరిగి కావాలనుకుంటే చెల్లిస్తామన్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పరిసరాలను శుభ్రపరుస్తున్నామని తెలిపారు. మహామండపం నుంచి మెట్లమార్గం ద్వారా ఘాట్‌ రోడ్డు మార్గాల్లోనే భక్తుల అనుమతినిచ్చామన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు దర్శనానికి రాకపోవడమే మంచిదని సూచించారు. పొంగలి, కదబం, దద్దోజనం వంటి ప్రసాదాలు ప్యాకెట్ల రూపంలో అందిస్తున్నామని తెలిపారు. (ఓ మై గాడ్‌... వెంకన్న రక్షించాడు)

చదవండి: కరోనాపై టీటీడీ దండయాత్ర

మరిన్ని వార్తలు