కరోనా: శ్రీకాకుళంలో ఏడు హాట్‌ స్పాట్లు

9 Apr, 2020 09:28 IST|Sakshi
నరసన్నపేట మండలం జమ్ములో ఇంటింటి సర్వేను పరిశీలిస్తున్న కలెక్టర్‌ నివాస్‌ 

ఆ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టిన అధికారులు  

కరోనా వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు  

14 రోజుల నుంచి 28 రోజులకు పెంచిన క్వారంటైన్‌  

27 అంతర్‌ రాష్ట్ర చెక్‌ పోస్టుల వద్ద నిఘా  

ఏడు అంతర్‌ జిల్లా చెక్‌ పోస్టుల ఏర్పాటు 

జాతీయ రహదారిపై మరో మూడు చెక్‌ పోస్టులు  

బయట నుంచి ఎవరొచ్చినా నేరుగా క్వారంటైన్‌కు తరలింపు

సాక్షి, శ్రీకాకుళం: శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఆ మాట ఎలా ఉన్నా.. చీమ చిటు క్కుమన్నా పట్టేసుకునే వ్యూహాన్ని అధికారులు అనుసరిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇతర ప్రాంతాల నుంచి 6 వేలమందికి పైగా జిల్లాలోకి వచ్చా రు. అధికారులు దాదాపుగా వారందరినీ గుర్తించి.. హోమ్, ప్రత్యేక క్వారంటైన్‌లో పెట్టారు. జిల్లాలో ఇంతవరకు ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. అలాగని మనం సురక్షితమని చెప్పలేం. ఎప్పుడెవరు, ఎక్కడి నుంచి జిల్లాలో ప్రవేశిస్తారో చెప్పలేని పరిస్థితి.

విదేశాలు, ముంబాయి, ఢిల్లీ నుంచి వచ్చిన వారితో ఎటువంటి ముప్పు వాటిల్లుతుందో అంచనా వేయలేం. అందుకే జిల్లాలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాద తీవ్రతను గమనించి జిల్లాలో ఏడు హాట్‌ స్పాట్లను గుర్తించారు. వాటిపై నిరంతర నిఘా పెట్టారు. డేంజర్‌ జోన్‌లోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదన్న ఉద్దేశంతో పకడ్బందీగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఒకవైపు కలెక్టర్‌ జె.నివాస్, మరోవైపు జిల్లా ఎస్పీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై దృష్టి సారించారు.  

హాట్‌ స్పాట్లపై నిరంతర నిఘా 
విదేశాల నుంచి జిల్లాకు 1445మంది వచ్చారు. ముంబాయి, ఢిల్లీ, రాజస్థాన్, చెన్నై, బెంగళూరుతోపాటు రాష్ట్రంలోని మిగతా జిల్లాల నుంచి 6031 మంది ప్రవేశించారు. వీరంతా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం తొలుత 14 రోజుల క్వారంటైన్‌ సరిపోతుందని భావించారు. కానీ గుంటూరులో 14 రోజుల క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న వ్యక్తికి ఆ తర్వాత పాజిటివ్‌ వచ్చింది. దీంతో ముందు జాగ్రత్తగా 14 రోజుల క్వారంటైన్‌ను 28 రోజులకు పెంచారు. వీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా నిర్ణయించారు.

శ్రీకాకుళం, పలాస, గార, పోలాకి, ఇచ్ఛాపురం, సోంపేట, కంచిలి మండలాలను ఈ విధంగా గుర్తించి, ఈ ప్రాంతాలపై నిఘా ఎక్కువగా పెట్టడంతోపాటు ఎప్పటికప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి కదలికలను గమనించనున్నారు. వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని, వైద్య సేవలు అందించేందుకు వీలుగా ప్రత్యేక బృందాలను నియమించారు. కోవిడ్‌ ఆఫీస ర్, స్పెషలాఫీసర్లతో సాంకేతికంగా అక్కడి పరిస్థితులను జిల్లా అధికారులు తెలుసుకోనున్నారు.  

చెక్‌ పోస్టులతో అడ్డగోలు ప్రవేశాలకు చెక్‌  
బయటి ప్రాంతాల నుంచి వచ్చే వారిని కట్టడి చేయడానికి జిల్లా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్రం నుంచి జిల్లాలోకి ఎవరూ రాకుండా 27 అంతర్‌ రాష్ట్ర చెక్‌ పోస్టులను పటిష్టం చేశారు. పక్కనున్న విజయనగరం జిల్లా నుంచి ఎవరూ ప్రవేశించకుండా ఏడు అంతర్‌ జిల్లా చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. హైవే ద్వారా ఎవరూ రాకుండా ఎచ్చెర్ల, టెక్కలి, కోట»ొమ్మాళి వద్ద కొత్తగా చెక్‌ పోస్టులు నెలకొల్పారు. ఎవరైనా వస్తే అక్కడి నుంచి నేరుగా క్వారంటైన్‌కు పంపించనున్నారు.

మరిన్ని వార్తలు