ఏపీలో 2,58,450 మందికి కరోనా పరీక్షలు

20 May, 2020 04:52 IST|Sakshi

తాజాగా 57 పాజిటివ్‌ కేసులు

కొత్త కేసుల్లో 6 కోయంబేడు నుంచి వచ్చినవే

నమోదైన మొత్తం కేసులు 2,489

కోవిడ్‌ నుంచి కోలుకుని 1,621 మంది డిశ్చార్జి  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటివరకు 2,58,450 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. మొత్తం 2,489 పాజిటివ్‌ కేసులు నిర్థారణ అయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. గడచిన 24 గంటల్లో (సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు) 9,739 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 57 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారించినట్లు తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో చిత్తూరు జిల్లాలో 5, పశ్చిమ గోదావరిలో ఒకటి.. మొత్తంగా 6 కేసులు తమిళనాడు రాష్ట్రంలోని కోయంబేడు నుంచి వచ్చినవే. 

ఒక్కరోజే 69 మంది డిశ్చార్జి 
సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు 69 మంది కోవిడ్‌ నుంచి కోలుకోవడంతో వారిని డిశ్చార్జ్‌ చేశారు. 
► రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం 2,489 పాజిటివ్‌ కేసులకు గాను 1,621 మంది సంపూర్ణంగా కోలుకొని వివిధ ఆస్పత్రుల నుండి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 816 మంది చికిత్స పొందుతున్నారు. 
► కొత్తగా చిత్తూరులో ఒకరు, కర్నూలులో ఒకరు మృతి చెందడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్‌ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 52కి చేరింది. 
► రాష్ట్రంలో పాజిటివ్‌ రేటు 0.96 శాతానికి పడిపోయింది. రికవరీ రేటు 65.13 శాతంగా ఉంది.  

మరిన్ని వార్తలు