తెలంగాణ, కర్నాటకల నుంచి వచ్చే వారికి పరీక్షలు తప్పనిసరి

14 Jul, 2020 04:16 IST|Sakshi

క్వారంటైన్‌ విధానంలో మార్పులు 

ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

సాక్షి, అమరావతి: తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వారికి సరిహద్దుల వద్ద స్వాబ్‌ టెస్ట్‌లు తప్పనిసరి చేసి, క్వారంటైన్‌కు తరలించనున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి క్వారంటైన్‌ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను గతంలో రిస్క్‌ ప్రాంతాలుగా ప్రకటించింది. కాగా ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో కేసులు తీవ్రస్థాయికి చేరుకోవడంతో వాటిని హైరిస్క్‌ ప్రాంతాలుగా గుర్తించింది. 

► విదేశాల నుంచి వచ్చే వారికి ఏడురోజుల క్వారంటైన్‌ తప్పనిసరి. గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చే వారికి గతంలో ఉన్న 14 రోజుల క్వారంటైన్‌ విధానాన్ని 7 రోజులకు తగ్గింçపు. 
► విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్‌లో ఉన్న వారికి 5వ రోజు, 7వ రోజు కోవిడ్‌ టెస్టులు చేయాలి. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విమానాల ద్వారా వచ్చే ప్రయాణికులకు ర్యాండమ్‌గా పరీక్షలు. 10శాతం మందిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తారు. 
► విమానాశ్రయాల్లోనే స్వాబ్‌ టెస్టుల నిర్వహణ. వారందరికీ 14 రోజుల క్వారంటైన్‌. రైళ్ల ద్వారా వచ్చే ప్రయాణికులకు ర్యాండమ్‌గా పరీక్షలు. 14రోజులు హోం క్వారంటైన్‌ తప్పనిసరి. 
► రోడ్డు మార్గం ద్వారా రాష్ట్రానికి వచ్చే వారికి సరిహద్దుల వద్దే స్వాబ్‌ టెస్టులు.    తెలంగాణ, కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి 14 రోజుల హోం క్వారంటైన్‌. రాష్ట్రానికి వచ్చేందుకు స్పందన యాప్‌ ద్వారా ఇ–పాస్‌ తీసుకున్న వారికే అనుమతి. 
► సరిహద్దుల వద్ద పరీక్షలు నిర్వహించి,  పాజిటివ్‌ వస్తే కోవిడ్‌ ఆసుపత్రులకు తరలింపు.  హోం క్వారంటైన్‌లో ఉండే వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు ఏఎన్‌ఎం, గ్రామ/ వార్డు వలంటీర్లు, సచివాలయాల ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం కలెక్టర్లకు సూచించింది.

మరిన్ని వార్తలు