ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత రేషన్‌ పంపిణీ ప్రారంభం

29 Apr, 2020 08:32 IST|Sakshi

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌తో పేద ప్రజలు ఇబ్బంది పడకుండా వారిని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ముందుకొచ్చింది. ఇప్పటికే రెండు విడతల ఉచిత రేషన్‌ సరుకులను పంపిణీ చేయగా బుధవారం అన్ని జిల్లాల్లో మూడో విడత కింద ఉచిత రేషన్‌ సరుకుల పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా  బియ్యం కార్డు ఉన్న 1,47,24,017 కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 43,685 రేషన్ దుకాణాల కౌంటర్ల ద్వారా సరుకుల పంపిణీ జరుగుతోంది. ఉదయం 6 గంటల నుంచి సరుకులు పంపిణీ చేస్తున్నారు. (చదువే ఆస్తి.. నాదే పూచీ)

కృష్ణా: జిల్లాలో మూడో విడత ఉచిత రేషన్ పంపిణీ ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైంది. జిల్లాలో 2300 రేషన్ షాపుల ద్వారా పంపిణీ జరుగుతోంది. బియ్యం కార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, కేజీ కందిపప్పు అందిస్తున్నారు. కేంద్రప్రభుత్వ నిబంధనలతో కార్డుదారుల బయో మెట్రిక్ తప్పనిసరి చేశారు. రేషన్ షాప్ కౌంటర్ల వద్ద అందుబాటులో శానిటైజర్లు ఉంచారు. సరుకులు తీసుకునే ముందు, ఆ తరువాత కూడా శానిటైజ్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. భౌతిక దూరంను పాటిస్తూ రేషన్ తీసుకునేందుకు టైం స్లాట్ కూపన్లు అందజేస్తున్నారు.

చిత్తూరు: జిల్లాలో మూడో విడత కింద ఉచిత రేషన్‌ సరుకులను పంపిణీ ఉదయం నుంచి మొదలైంది. తెల్ల రేషన్ కార్డు దారులకు  బియ్యం, కందిపప్పును అందిస్తున్నారు. ఇక జిల్లాలో మొత్తం 299 రేషన్ షాపుల వద్ద బియ్యం, కంది పప్పు పంపిణీ చేస్తుస్తున్నారు. రేషన్ షాపుల వద్ద భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే సానిటీజర్లను అందుబాటులో ఉంచారు. కరోనా వల్ల కష్టకాలంలో ఉన్న తమను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదుకొంటున్నారని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

నెల్లూరు: జిల్లాలో మూడో విడత రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమం మొదలైంది. వాలంటీర్లు ద్వారా రేషన్ పంపిణీ, రేషన్ దుకాణాల వద్ద మాస్క్‌ల పంపిణీ జరుగుతోంది. అధికారులు రేషన్ దుకాణం వద్ద భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.

విశాఖపట్నం: జిల్లాలో మూడో విడత రేషన్ పంపిణీ  ప్రారంభించి, తెల్ల రేషన్ కార్డుదారులకు  బియ్యం, కందిపప్పును అందిస్తున్నారు. అలాగే రేషన్‌ షాపుల వద్ద డీలర్లు సానిటీజర్లను అందుబాటులో ఉంచారు.

పశ్చిమ గోదావరి: జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి మూడోవిడత ఉచిత రేషణ్ పంపిణీ కార్యక్రమాన్ని డీలర్లు మొదలుపెట్టారు. జిల్లాలోని అర్హత కలిగిన 12.48 లక్షల‌ కుటుంబాలకు సరుకులను అందజేయనున్నారు. ప్రతి రేషణ్ డిపో‌ వద్ద భౌతిక దూరం ఉండేట్లు వాలంటీర్లు చర్యలు తీసుకుంటున్నారు. ఏలూరులోని ఉచిత రేషణ్ పంపిణీ కార్యక్రమాని జిల్లా కలెక్టర్ రమాణారెడ్డి పరిశీలించారు.

కర్నూలు: జిల్లాలో మూడోవ విడత బియ్యం, కందిపప్పు పంపిణీ ప్రారంభమైంది. జిల్లాలోని 2436 రేషన్ షాపుల్లో 11.91 లక్షల కార్డుదారులకు బియ్యం పంపిణీ జరగనుంది. సామాజిక దూరం పాటించి బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రేషన్‌  డీలర్లు నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు